నగరంలో ఆక్రమణల చెరలో ఉన్న విలువైన ప్రభుత్వ భూములను, చెరువులను కాపాడేందుకు హైడ్రా (HYDRAA) తన దూకుడును కొనసాగిస్తోంది. శుక్రవారం నగరంలోని వివిధ ప్రాంతాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించిన అధికారులు, సుమారు మూడున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని, 11 ఎకరాల చెరువు ఎఫ్టీఎల్ (FTL) పరిధిని, శివాలయానికి చెందిన విలువైన భూమిని ఆక్రమణదారుల నుండి విముక్తి కల్పించారు. నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన అక్రమ కట్టడాలను జెసిబిలతో నేలమట్టం చేశారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్-గండిమైసమ్మ మండలం పరిధిలోని దూలపల్లి గ్రామంలో ఉన్న సుమారుకుంట చెరువు వద్ద హైడ్రా భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టింది. దాదాపు 42 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కొందరు వ్యక్తులు శిఖం పట్టా భూమి సాకుతో మట్టి నింపి అక్రమ కట్టడాలు చేపట్టారు. నిబంధనల ప్రకారం చెరువు నీటి నిల్వ ప్రాంతంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ, అక్కడ వెలసిన స్క్రాప్ దుకాణాలు, తాత్కాలిక షెడ్లలోని హోటళ్లు, వెల్డింగ్ షాపులు మరియు కంటైనర్ తయారీ కేంద్రాలను హైడ్రా అధికారులు తొలగించారు. మొత్తం 11 ఎకరాల మేర ఆక్రమణలను క్లియర్ చేసిన అధికారులు, వర్షాకాలంలో వరద ముప్పు తప్పించడానికే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. పట్టా భూములైనా కేవలం వ్యవసాయానికి మాత్రమే వాడుకోవాలని, నిర్మాణాలు చేపడితే సహించేది లేదని హెచ్చరించారు.
ఖైరతాబాద్ మండలం యూసుఫ్ గూడ గ్రామంలోని సర్వే నంబర్ 128/1 లో ఉన్న సుమారు మూడున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) చట్టం కింద ప్రభుత్వం సేకరించిన ఈ భూమిని కొందరు అక్రమంగా అనుభవిస్తున్నారు. ముఖ్యంగా షరీఫ్ ఖాన్ అనే వ్యక్తి తప్పుడు పత్రాలను సృష్టించి 3600 గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించగా.. అధికారులు అతనిపై బోరబండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ భూమిలో సాగుతున్న ఇసుక, ఇటుక వ్యాపారాలను నిలిపివేసి, తాత్కాలిక షెడ్లను తొలగించారు. అనంతరం ప్రభుత్వ భూమిగా ప్రకటిస్తూ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
కీసర మండలం నాగారం లోని రామకృష్ణ నగర్ కాలనీ (HMT లేఅవుట్)లో ఉన్న శివాలయానికి చెందిన 1365 గజాల భూమిని ఆక్రమణల నుండి హైడ్రా కాపాడింది. 2017లో నిర్మించిన ఈ ఆలయానికి చెందిన మిగిలిన ఖాళీ స్థలాన్ని స్థానిక కబ్జాదారులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని కాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఆ భూమి దేవాలయానిదేనని నిర్ధారించుకున్న అధికారులు, అక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. దేవాలయ భూములను కాపాడటంతో కాలనీ వాసులు హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ పరిణామాలతో నగరంలోని అక్రమ కట్టడాల యజమానుల్లో వణుకు మొదలైంది. ప్రభుత్వ ఆస్తులను, జలవనరులను కాపాడటంలో రాజీపడే ప్రసక్తే లేదని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.
ALSO READ: KTR: ‘మా భూములు పోయాయి.. మా బతుకులు మారలేదు’.. కేటీఆర్ కాన్వాయ్ను అడ్డుకున్న సిరిసిల్లల ప్రజలు