Vijayawada: బతుకుదెరువు కోసం పల్లెటూర్ల నుంచి చిన్న నగరాలకు చాలామంది వస్తుంటారు. అందులో కూలీలు, కార్మికులు, చిరు వ్యాపారులు ఉంటారు. నగరానికి వచ్చిన తర్వాత రాత్రి ఎక్కడ ఉండాలా? అంటూ రకరకాలుగా ఆలోచిస్తుంటారు. అలాంటివారిని విజయవాడ నగరంలో ఎన్జీవోలు-మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా ఉచితంగా షెల్టర్ ఏర్పాటు చేశాయి. దీనిపై మరిన్ని డీటేల్స్ ఒక్కసారి చూద్దాం.
పల్లెటూర్లు నుంచి ఉపాధి కోసం చాలామంది విజయవాడ వస్తుంటారు. ఆ విధంగా వచ్చినవారికి వసతి విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. లాడ్జి, హోటల్లో ఉండటానికి డబ్బులు లేని పరిస్థితుల్లో ఉంటారు. వీలు లేక చాలామంది రోడ్లు-బస్టాండ్లలో రాత్రి వేళ నిద్రపోతుంటారు. ఇకపై అలాంటి సమస్య అవసరం లేదు. అలాంటివారికి కొద్దిరోజులు విజయవాడలో ఉచితంగా వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. మున్సిపల్ సంస్థలు-ఎన్జీవోలు కలిసి ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చాయి. అందుకు కావాల్సింది ఆధార్ కార్డు ఉంటేచాలు. ఉచితంగా వసతి, భోజన సదుపాయం పొందవచ్చు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్-మెప్మా-పలు ఎన్జీవోలు కలిసి ఉచితంగా వసతి కల్పించేందుకు షెల్టర్లను ఏర్పాటు చేశారు. విజయవాడ సిటీలోని దాదాపు పది ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. జాతీయ పట్టణ జీవనోపాధి పథకం కింద.. రాణిగారితోట, వైఎస్సార్ కాలనీ, సీతన్నపేట, హనుమాన్ పేట, ఆంధ్రప్రభ కాలనీ, వడ్డెర కాలనీ, రూట్స్ హెల్త్ ఫౌండేషన్, మ్యాంగో మార్కెట్ వంటి ప్రాంతాల్లో ఉచిత షెల్టర్లు రెడీ చేశారు. ఆధార్ కార్డు చూపిస్తే చాలు రూపాయి కూడా తీసుకోకుండా రెండువారాల పాటు ఉచితంగా వసతి లభించనుంది. ఉచిత వసతి కల్పన కోసం విజయవాడ కొర్పొరేషన్-ఎన్జీవో ప్రతినిధులు ప్రతిరోజూ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు.
ఎవరికైనా కుటుంబం లేకపోతే వాళ్లకు దీర్ఘకాలికంగా ఆశ్రయం కల్పిస్తున్నారు నిర్వాహకులు. వసతితోపాటు సమయానికి తిండి పెడుతూ వసతి కల్పిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి రెండు లేదా మూడు వారాలు ఉచితంగా వసతి కల్పిస్తున్నారు. అయితే దీర్ఘకాలం ఉండటానికి అవకాశం లేదని చెబుతున్నారు నిర్వాహకులు. కేవలం రోడ్లపై నిద్రించాల్సి వచ్చేవారి కోసం వీటిని ఏర్పాటు చేశారని చెబుతున్నారు. చాలామందికి అవగాహన లేక రావడం లేదంటున్నారు. చాలామంది రోడ్లపై భోజనం పంపిణీ చేస్తుండటంతో షెల్టర్ల వైపు చూడలేదని చెబుతున్నారు.