Free Petrol: ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు ఇంధన కొరత వార్తలు కలవరపెడుతుంటే, తిరుపతిలో మాత్రం ఒక పెట్రోల్ బంక్ యజమాని తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డీజిల్ స్టాక్ లేక బంకులు మూతపడుతున్న తరుణంలో, తిరుపతి సమీపంలోని తనపల్లి వద్ద ఉన్న ఒక పెట్రోల్ బంకులో టూ వీలర్ వాహనదారులకు ఉచితంగా లీటర్ పెట్రోల్ పంపిణీ చేస్తున్నారు.
ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది బంక్ యజమాని రాజేష్ రెడ్డి. సాధారణంగా పెట్రోల్ ధరలు సెంచరీ దాటిన ఈ రోజుల్లో చుక్క పెట్రోల్ కోసం జనం ఇబ్బంది పడుతుంటే, ఏకంగా లీటర్ పెట్రోల్ ఫ్రీ అనగానే స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. విషయం తెలియగానే చుట్టుపక్కల గ్రామాల నుంచి వాహనదారులు భారీ సంఖ్యలో బంకు వద్దకు చేరుకోవడంతో అక్కడ కిలోమీటర్ల మేర బైకుల క్యూ కనిపిస్తోంది.
రాజేష్ రెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ.. తాము గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సంక్షోభం (Crisis) నేపథ్యంలో సామాన్యులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కేవలం ప్రచారం కోసం కాకుండా, కష్టకాలంలో తోటి వారికి సాయం చేయాలన్న ఆయన ఆలోచనను వాహనదారులు మెచ్చుకుంటున్నారు. మొత్తానికి రాష్ట్రమంతా ఇంధనం కోసం కటకటలాడుతుంటే, ఈ ‘తనపల్లి బంకు’ మాత్రం తిరుపతిలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
Also Read: అవమానం నుంచి అద్భుతం.. త్రిస్సూర్ పూరం వెనుకున్న షాకింగ్ హిస్టరీ!