Gudivada Amarnath: రాష్ట్రంలో తాజాగా జరిగిన కలెక్టర్ల సమావేశంపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు రెండు రోజులపాటు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నంగానే ఉన్నాయని ఆయన విమర్శించారు. పరిపాలనలో స్పష్టమైన దిశ లేకపోవడంతో, ప్రభుత్వ చేతగానితనాన్ని కలెక్టర్లు, ఎస్పీలపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
గత 18 నెలల పాలనలో ప్రజలకు ప్రభుత్వం చేసిన మంచి ఏమిటో చెప్పగలరా అని అమర్నాథ్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని మండిపడ్డారు. పాలనలో లోపాలు బయటపడుతున్న వేళ, అధికారులపై నిందలు వేయడం ద్వారా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు.
ఇటీవల ల్యాండ్ డిస్ప్యూట్స్పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన గుడివాడ అమర్నాథ్, వాటి ద్వారా ఒక కీలక విషయం బయటపడుతోందని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రైవేట్ భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటూ ప్రజలను బెదిరిస్తున్నారన్న భావన ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి, న్యాయ వ్యవస్థకు ప్రమాదకర సంకేతమని అన్నారు.
ఎదుగుతున్న విశాఖపట్నం వంటి నగరాల్లో ప్రజాప్రతినిధులే సివిల్ డిస్ప్యూట్స్లో ఇన్వాల్వ్ అయితే, భవిష్యత్తులో పెట్టుబడులు ఎలా వస్తాయని అమర్నాథ్ ప్రశ్నించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే న్యాయపాలన, చట్టబద్ధమైన పరిపాలన అవసరమని, కానీ ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు పెట్టుబడిదారుల్లో భయాందోళనలు కలిగించేలా ఉన్నాయని విమర్శించారు.
కలెక్టర్లు, ఎస్పీలకు చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, సీఎం లేదా డిప్యూటీ సీఎం ఏం చెప్తే అధికారులు అదే అమలు చేస్తారని అన్నారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చేది రాజకీయ నాయకులేనని, ఇప్పుడు వాళ్లే బాధ్యత నుంచి తప్పించుకుని అధికారులపై నెట్టడం అన్యాయమని అన్నారు.
ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు గుడివాడ అమర్నాథ్ సూచన చేశారు. ప్రైవేట్ ల్యాండ్ డిస్ప్యూట్స్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోకుండా ఉండాలని నిజంగా మీరు కోరుకుంటే, కలెక్టర్ల సమావేశాల్లో కాదు, సీఎం చంద్రబాబుతో కలిసి ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి స్పష్టంగా చెప్పాలని సూచించారు. ప్రైవేట్ భూ వివాదాల్లో రాజకీయ జోక్యం వద్దు అని చెప్పగలిగితేనే నిజమైన పాలన జరుగుతుందని అన్నారు.
Also Read: ఏపీని గ్రోత్ ఇంజిన్గా మారుస్తాం.. నిధలివ్వండి: కేంద్రమంత్రి నిర్మలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ
ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి చూస్తే, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా, పరిపాలన లోపాలను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని అమర్నాథ్ విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ముందుగా రాజకీయ నాయకులు బాధ్యత తీసుకోవాలని, అధికారులను బలి చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.