గుంటూరు నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. డ్రగ్స్కు బానిసైన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని కన్నతల్లిపై దాడి చేసింది. దీంతో మనస్తాపం చెందిన ఆ తల్లి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం బాధిత మహిళ గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. బాలిక మానసిక ప్రవర్తనపై లాలాపేట పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. డ్రగ్స్ కలకలంపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షిస్తున్నారు.
ఇన్స్టాగ్రామ్లో ఓ సీనియర్తో ఏర్పడిన పరిచయం కారణంగా ఈ బాలిక డ్రగ్స్ ఉచ్చులో పడినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి ప్రేమ పేరుతో బాలికకు డ్రగ్స్ అలవాటు చేసి, ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా, వీడియోలు తీసినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం కుమార్తె ఫోన్లో వీడియోలను గమనించిన తల్లిదండ్రులు ఆమెను నిలదీశారు. పెళ్లి విషయంలో తల్లీకూతుళ్ల మధ్య ఆరు నెలలుగా వాగ్వాదం జరుగుతుండగా, ఇటీవల వీడియోలు బయటపడటంతో ఈ నెల 12న రాత్రి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కుమార్తె దాడి చేయడంతో తల్లి ఆత్మహత్యాయత్నం చేశారు.
బాలిక డ్రగ్స్ వ్యవహారం బయటపడటంతో ఈగల్ టీమ్ ఐజీ ఆర్.కె. రవికృష్ణ జీజీహెచ్కు చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాలికకు డ్రగ్స్ అలవాటు చేసిన వ్యక్తి ఓ రాజకీయ పార్టీ విద్యార్థి సంఘం నాయకుడిగా సమాచారం. ప్రస్తుతం బాలికను డి-అడిక్షన్ సెంటర్కు తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మైనర్ బాలికకు డ్రగ్స్ అలవాటు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.