Pemmmasani Chandrasekhar: గుంటూరు జిల్లా మందడంలో N-8 రోడ్డు విస్తరణ పనుల కారణంగా ఇళ్లు, ఆస్తులు కోల్పోతున్న నిర్వాసితులు నిన్న ఒక సమావేశం నిర్వహించారు. ఈ ఆందోళనకర పరిస్థితుల్లో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. తీవ్ర మనస్తాపానికి గురైన రామారావు అనే వ్యక్తి అక్కడికక్కడే గుండెపోటుతో మరణించారు. అభివృద్ధి పేరుతో తమ ఉపాధిని, నివాసాలను దూరం చేస్తున్నారనే ఆందోళన ఆయన ప్రాణం తీసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
రామారావు మృతి వార్త తెలుసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఆయన భౌతికకాయానికి నివాళులర్పించేందుకు వెళ్లారు. అయితే.. అక్కడ వారికి చేదు అనుభవం ఎదురైంది. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు, మేము రోడ్డున పడుతున్నప్పుడు నోరు విప్పని మీరు, ఇప్పుడు ప్రాణం పోయాక నివాళులర్పించడానికి ఎందుకు వచ్చారు?’ అంటూ నిలదీశారు. ‘పోయిన మనిషిని తిరిగి తీసుకురాగలరా? మీ సానుభూతి మాకు అక్కర్లేదు’ అని తెగేసి చెప్పడంతో.. మాట్లాడకుండానే ప్రజాప్రతినిధులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
అనంతరం మంత్రి నారాయణ మందడం చేరుకుని రామారావు భౌతికకాయానికి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి, మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ ద్వారా రామారావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి నారాయణ కూడా కుటుంబానికి భరోసా కల్పిస్తూ.. నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని మాట ఇచ్చారు.
ALSO READ: Vijayawada Kanaka Durga: RS.3 కోట్ల బకాయిలు.. కీలాద్రికి కరెంట్ కట్