Vijayawada Kanaka Durga: విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసింది APCPDCL. సుమారు 3 కోట్ల రూపాయలకు పైగా విద్యుత్ బిల్లుల బకాయిలు ఉండటంతో.. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతీయ విద్యుత్ పంపిణీ సంస్థ (APCPDCL) కఠిన నిర్ణయం తీసుకుంది.
దుర్గగుడి యాజమాన్యం 2023 ఫిబ్రవరి నెల నుండి విద్యుత్ బిల్లులను సక్రమంగా చెల్లించడం లేదు. గత రెండేళ్లుగా ఈ బకాయిలు పేరుకుపోతూ దాదాపు 3.20 కోట్ల రూపాయలకు చేరాయి. ఈ క్రమంలో బకాయిలు చెల్లించాలని విద్యుత్ శాఖ పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ.. ఆలయ అధికారులు సరైన రీతిలో స్పందించలేదని తెలుస్తోంది. గడువు ముగిసినా స్పందన లేకపోవడంతో నిబంధనల ప్రకారం విద్యుత్ కనెక్షన్ను డిస్కనెక్ట్ చేసినట్లు APCPDCL స్పష్టం చేసింది.
హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆలయ పరిసరాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే.. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఆలయ అధికారులు వెంటనే అప్రమత్తమై జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అయినప్పటికీ, లిఫ్టులు, ఏసీలు, ఇతర సేవలపై స్వల్ప ప్రభావం పడటంతో భక్తులు కొంత ఇబ్బందికి గురయ్యారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే వేలాది మంది భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆలయ ఈఓ సహా ఇతర ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు.
విద్యుత్ కట్ చేసిన వెంటనే దుర్గగుడి అధికారులు APCPDCL ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. బకాయిల చెల్లింపుపై స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు, ప్రస్తుతం ఉన్న సమస్యను వివరించారు. భక్తుల రద్దీని, ఆలయ ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకున్న విద్యుత్ శాఖ అధికారులు మానవతా దృక్పథంతో తాత్కాలికంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. రాబోయే కొద్ది రోజుల్లోనే పెండింగ్లో ఉన్న బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని ఆలయ అధికారులు అంగీకరించినట్లు సమాచారం. ఇంతటి భారీ ఆదాయం ఉన్న దేవస్థానంలో విద్యుత్ బిల్లుల బకాయిలు పేరుకుపోవడంపై భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: Sangareddy Crime: కోతులను తప్పించబోయి చెరువులో పడ్డ ఆటో.. ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు