Bandi Sanjay: ఇటీవల డ్రగ్స్ కేసులపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తాజాగా సంచలనవ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ వ్యవహారం ఎలా నీరుగార్చబడిందన్న అంశాన్ని బండి సంజయ్ తీవ్రంగా ప్రస్తావించారు.
రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా ఏడాది పొడవునా చురుగ్గా ఉంటుందని, కానీ విచిత్రంగా పండుగల సమయంలో మాత్రమే కేసులు బయటకు వస్తాయని ఆయన ఎద్దేవా చేశారు. ఇది ప్రభుత్వాల వైఫల్యాన్ని స్పష్టంగా చూపుతోందని విమర్శించారు. డ్రగ్స్ నిర్మూలనపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిరంతర విచారణ, కఠిన చర్యలు ఉండాలన్నారు.
డ్రగ్స్ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, అప్పట్లో సిట్కు నాయకత్వం వహించిన అకున్ సబర్వాల్ పాత్రను బండి సంజయ్ గుర్తు చేశారు. అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో సాగిన విచారణకు ఏమైంది? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆ విచారణలో అనేక మంది ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయని, సెలబ్రిటీల ప్రమేయం ఉందన్న ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయని గుర్తుచేశారు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా ఆ కేసు నిశ్శబ్దంగా మారిపోయిందని విమర్శించారు.
ఇంకా ముందుకెళ్లిన బండి సంజయ్, డ్రగ్స్ కేసులో నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను ప్రస్తావించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా తమతో పాటు డ్రగ్స్ తీసుకున్నారని నిందితులు వాంగ్మూలం ఇచ్చారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి కీలక ఆరోపణలు వెలుగులోకి వచ్చినప్పటికీ, కేసీఆర్ ప్రభుత్వం ఆ కేసును కావాలని నీరుగార్చిందని ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లతోనే దర్యాప్తును పక్కదారి పట్టించారని అన్నారు.
అకున్ సబర్వాల్ను అర్థాంతరంగా డ్రగ్స్ కేసు విచారణ నుంచి తప్పించడం వెనుక.. పెద్ద కుట్ర ఉందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నిజాయితీగా పనిచేసిన అధికారిని పక్కన పెట్టి, కేసును మట్టుబెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అకున్ సబర్వాల్ సేకరించిన కీలక ఆధారాలు, వీడియో ఫుటేజ్, నిందితుల స్టేట్మెంట్లు అన్నింటినీ అప్పటి చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
ఆ ఆధారాలన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి? ఎందుకు ఇప్పటివరకు విచారణ జరగడం లేదు? అని బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. డ్రగ్స్ కేసులో అసలు నిజాలు బయటకు రాకుండా చేయడంలో ఉన్నతస్థాయి అధికారులు పాత్ర పోషించారా? అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా సోమేశ్ కుమార్ పాత్రపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
Also Read: వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది పెరిగిన నేరాల సంఖ్య.. వార్షిక నివేదికను విడుదల చేసిన సీపీ
సోమేశ్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారిస్తేనే.. డ్రగ్స్ కేసులో నిజాలు బయటపడతాయని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఎవరు ఎంత పెద్దవారైనా చట్టానికి అతీతులు కాదని అన్నారు. డ్రగ్స్ మాఫియాతో రాజకీయ నాయకులు, అధికారుల కుమ్మక్కు ఉంటే ప్రజలకు నిజం తెలిసేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
డ్రగ్స్ కేసులపై ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
పండుగలప్పుడే డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారా?
అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ కేసు విచారణ ఏమైంది?
అనేక మంది సెలబ్రిటీల పేర్లు బయటకొచ్చాయి కదా
కేసీఆర్ కుటుంబ సభ్యులు తమతో పాటు డ్రగ్స్ తీసుకున్నారని నిందితులు… https://t.co/Y3BIm8k9uP pic.twitter.com/bEOzJAeQcT
— BIG TV Breaking News (@bigtvtelugu) December 27, 2025