Harsha Kumar: రాజమండ్రి మాజీ ఎంపీ జి.వి. హర్షకుమార్ ఇటీవల ప్రభుత్వంపై చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా ప్రవీణ్ పగడాల మృతి , రాజమండ్రి పాల కల్తీ వ్యవహారాలపై ఆయన కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తీవ్రస్థాయిలో విమర్శించారు.
ప్రవీణ్ పగడాల మృతి విషయంలో ప్రభుత్వ తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని హర్షకుమార్ ఆరోపించారు. పరకామణి చోరీ కేసులో కీలకమైన పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోతే.. ప్రభుత్వం ఎందుకు SIT (సిట్) వేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటన వెనుక ప్రభుత్వ హస్తం ఉందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ.. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం సమంజసం కాదన్నారు. మార్చి 24న రాజమండ్రిలోని లూథర్ గిరి మైదానంలో ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ నిర్వహిస్తున్నామని.. దీనికి అడ్డంకులు సృష్టించకుండా అనుమతులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజమండ్రిలో జరిగిన పాల కల్తీ వ్యవహారం అధికారుల అసమర్థతకు నిదర్శనమని హర్షకుమార్ మండిపడ్డారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రతి మూడు నెలలకు ఒకసారి తనిఖీలు చేయాల్సి ఉన్నా.. ఏళ్ల తరబడి పట్టించుకోకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించాయని ఆరోపించారు. ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల భారం వల్ల కొంతమంది ఉద్యోగులు అవినీతి వైపు మళ్లుతున్నారని.. వ్యవస్థలను సక్రమంగా పనిచేయనివ్వడం లేదని విమర్శించారు. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు.
పుష్కరాల సమయంలో జరిగిన మరణాల నుండి ఇటీవల సింహాచలం, తిరుమలలో భక్తుల మృతి వరకు జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ.. ముఖ్యమంత్రి వైఖరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాజకీయాలు చేస్తూ దాని పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది. కానీ కల్తీ జరగలేదని చెప్పలేదని ఆయన గుర్తుచేశారు. కూటమి నేతలు ప్రతి విషయంలోనూ దేవుడిని లాగి మత రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
Also Read: రూ.16 కోట్లతో చలి మంట కాచుకున్నాడు.. ఎవరీ డ్రగ్ డాన్?