Hindupur Ysrcp Office Attack: హిందూపురం వైసీపీ కార్యాలయంపై టీడీపీ నాయకులు, బాలకృష్ణ అభిమానులు దాడి చేశారు. హిందూపురం వైసీపీ ఇన్ ఛార్జీ దీపికా రెడ్డి భర్త వేణురెడ్డి బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఈ దాడి జరిగింది. ఎక్కడో హైదరాబాద్ లో ఉండే వాడి కాళ్ల కింద మనం బతుకుతున్నాం, వారికి ఓట్లు వేస్తాం, వాళ్లు హైదరాబాద్లో కూర్చొంటారు, ఇక్కడ మనం బానిస బతుకులు బతుకుతున్నామని వేణురెడ్డి వ్యాఖ్యానించారు. వేణురెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం ఆయన ఆఫీసుపై దాడి చేశారు.
హిందూపురంలోని వైసీపీ ఆఫీసుపై టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచరులు చేసిన దాడి ప్రజాస్వామ్యంపైనే ప్రత్యక్ష దాడి అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ అనాగరిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయ పార్టీల కార్యాలయాలను ధ్వంసం చేయడం, ఫర్నిచర్ పగలగొట్టడం, అద్దాలను ధ్వంసం చేయడం, సిబ్బందిపై భౌతికంగా దాడి ప్రజాస్వామ్య నిబంధనల పతనాన్ని సూచిస్తుందన్నారు. దాడి జరుగుతున్నా పోలీసుల ఏంచేయలేకపోవడం ఆందోళనకరంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు రాజకీయ అజెండాలో భాగంగా రాష్ట్రంలో శాంతిభద్రతలను పోలీసులు గాలికి వదిలేశారని మండిపడ్డారు.
హిందూపురం ఘటనతో టీడీపీ హింసను ఎలా ప్రోత్సహిస్తుందో, భయపెట్టి రాజకీయ వ్యతిరేకతను అణిచివేయడానికి ఎలా ప్రయత్నిస్తుందో స్పష్టమవుతుందని వైఎస్ జగన్ అన్నారు. ప్రతిపక్ష పార్టీల ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కులను రక్షించలేని ప్రభుత్వానికి పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది వైసీపీపై మాత్రమే జరిగిన దాడి కాదని, ప్రజాస్వామ్యం, ప్రతి పౌరుడి రాజకీయ స్వేచ్ఛపై జరిగిన దాడి అన్నారు.
‘హిందూపురంలో టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. టీడీపీ నాయకులు ఎందుకు ఇంత బరితెగించి వ్యవహరిస్తున్నారు సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్యానికే ఇది బ్లాక్ డే. ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందనడానికి నిదర్శనమే ఈ దాడులు,దౌర్జన్యాలు’ అని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు.
హిందూపురంలోని వైయస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ నేతలు దాడి చేసి అద్దాలు, ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆరోపించారు. అడ్డొచ్చిన వైసీపీ కార్యకర్తలను కొట్టారన్నారు. టీడీపీ నేతలు ఎందుకు ఇంత దారుణ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం పోలీసులు పట్టించుకోకుండా వెళ్లిపోయారని ఆరోపించారు.