HomeStay Tourism: ఏపీలో కూటమి సర్కార్ టూరిజానికి అధిక ప్రయార్టీ ఇస్తోంది. ఇప్పటికే హోటల్స్, టెంట్ సిటీల పేరిట ఒక్కో అడుగు ముందుకేస్తోంది. తాజాగా హిల్స్ లేదా ట్రైబల్ టూరిజంపై ఫోకస్ చేసింది. ఇదేదో కొత్తగా ఉంది కదూ. సింపుల్గా చెప్పాలంటే ‘హోమ్ స్టే’ పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దీనివల్ల ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.
ప్రకృతి అందాలకు కేరాఫ్ ఉమ్మడి విశాఖ జిల్లా. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు తాకిడి క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు సిటీలకు మాత్రమే పర్యాటకులు వచ్చేవారు. ఇప్పుడు హిల్స్ ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నా రు. ఆ ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు బస చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అలాంటి సందర్శకులకు పల్లెల్లో వసతి ఏర్పాటు చేసి, వారికి ఇష్టమైన వంటకాలు తయారు చేసేందుకు పర్యాటక శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించే సందర్శకులకు ప్రకృతి అందాలతోపాటు ఆయా ప్రాంతాల స్థితిగతులను స్వయంగా తిలకించామనే అనుభూతి కలుగుతుంది. దీనివల్ల గిరిజనులకు ఉపాధి, ఆదాయం లభిస్తుందన్నది అధికారుల ఓ అంచనా.
ఈ క్రమంలో అల్లూరి జిల్లాలోని 15 మండలాలు, 171 గ్రామాల్లోని 1,083 ఇళ్లను ఎంపిక చేశారు. గిరిజన లబ్ధిదారులకు పీఎం జన్మన్ స్కీమ్లో కొత్త ఇళ్లు మంజూరు అయ్యాయి. కొత్త ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు చెందిన పాత ఇళ్లను ‘హోమ్ స్టే’కు ఉపయోగించాలన్నది అధికారులు ఆలోచన. ఆ విధంగా అడుగులు వేస్తున్నారు కూడా.
ALSO READ: చంద్రబాబు ఆటో రైడ్ పై వైసీపీ విమర్శలు, దిమ్మతిరిగేలా కౌంటర్లు
అందులో భాగంగా ఎంపిక చేసిన ఇళ్లను ఏపీ టూరిజం ఓ బృందం పరిశీలించనుంది. పాత ఇళ్ల స్థితిగతులు, హోమ్ స్టేకు అనుకూలంగా ఎలా తీర్చిదిద్దాలి? వాటిపై అధ్యయనం జరుగుతోంది. ఈ నెలాఖరులోగా పనులను వేగవంతం చేసి వింటర్ నాటికి ‘హోమ్ స్టే’ను సిద్ధం చేయాలని భావిస్తున్నారు.
గిరిజన గ్రామాల్లో హోమ్స్టే కార్యక్రమం ద్వారా అక్కడి వారికి చక్కని ఆదాయం లభించనుంది. గిరిజనులకు కొత్త ఇళ్లు మంజూరు తర్వాత పాత ఇంటిని శిథిలం చేస్తున్నారు. కొందరైతే అలా వదిలేస్తున్నారు. అలా కాకుండా పాత ఇంటిని అందంగా తీర్చిదిద్దితే పర్యాటకులకు అద్దెకు ఇవ్వవచ్చని ఆలోచన చేస్తున్నారు.
వచ్చే పర్యాటకులకు వసతి, భోజన సదుపాయాల ద్వారా స్థానిక గిరిజనులకు ఉపాధి పెరగడమేకాదు ఆదాయం కూడా వస్తుందని అంచనా వేస్తున్నారు. కొత్త విధానంతో పర్యాటకం అభివృద్ధితోపాటు గిరిజనులకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తోంది కూటమి సర్కార్.