Bhogapuram Airport Updates: అభివృద్ధి అనేది తాత్కాలికం కాదు. అభివృద్ధి అంటే శాశ్వతంగా నిలిచిపోయేది. తరతరాలకు బతుకునిచ్చేది. వారి భవ్యిషత్కి బాట చూపేది. విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అలాంటిదే! ఈ ఒక్క ప్రాజెక్ట్ పూర్తయితే.. ఉత్తరాంధ్ర రూపురేఖలే మారిపోనున్నాయ్. భోగాపురంలో ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే.. ఆ ప్రాంతమే కాదు చుట్టపక్కల ఉన్న మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయ్. ఈ ప్రాజెక్టుతో రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాదు.. పారిశ్రామిక, ఆర్థిక, సామాజిక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు బీజం పడనుంది.
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం..
అదే.. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్..
విజయనగరంలో జిల్లాలో ఈ విమానాశ్రయం పూర్తయితే.. ఉత్తరాంధ్ర లెక్కే మారిపోతుందనే మాటలు వినిపిస్తున్నాయి. అటు విశాఖ, ఇటు శ్రీకాకుళానికి మధ్య ఉన్న విజయనగరాన్ని కలిపేలా.. ఈ ఎయిర్పోర్ట్ని నిర్మిస్తున్నారు. ఎన్హెచ్-16కి ఆనుకొని దీనిని నిర్మిస్తుండటం.. మరో మేజర్ ప్లస్ పాయింట్. ఇప్పటికే.. ఎయిర్పోర్ట్ పనులు సుమారు 80 శాతం వరకు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది జూన్ నాటికి.. భోగాపురం ఎయిర్పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని.. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కూటమి ప్రభుత్వం వచ్చాక ఎయిర్పోర్ట్ పనుల్లో కదలిక
ఎయిర్పోర్ట్ పనులు వేగంగా సాగుతుండటంతో.. పదేళ్లుగా పడకేసిన రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రతిపాదన వచ్చింది. దాంతో.. రియల్టర్లంతా పెద్ద ఎత్తున లేఅవుట్లు వేసుకున్నారు. తర్వాత వైసీపీ హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్ క్వశ్చన్ మార్క్లా మారింది. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక.. విమానాశ్రయ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతుండటంతో.. రియల్టర్లలో మళ్లీ ఆశలు చిగురించాయి.
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో..
భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఉద్యోగ అవకాశాలు భారీగా పెరగనున్నాయి. ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, రిటైల్ లాంటి రంగాల్లో.. వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. పారిశఅరామికంగా, విమానాశ్రయానికి సమీపంలో కొత్త పరిశ్రమలు, గోడౌన్లు, వ్యాపార సంస్థలు ఏర్పడతాయి. ఇది.. ఆ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేస్తుందని చెబుతున్నారు.
ఉత్తరాంధ్రలో ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ముందుకు
ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యూచర్ అంతా టూరిజందే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో.. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను కోరుతున్నారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాల తీర ప్రాంతాల్లో.. టూరిజాన్ని డెవలప్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఫైవ్ స్టార్ హోటళ్ల నుంచి బీచ్లో కాటేజీల దాకా అన్నింటిపైనా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. టూరిజంతో పాటు ఐటీ సెక్టార్, ఇంజనీరింగ్ పరిశ్రమల్ని అభివృద్ధి చేసి.. ఉత్తరాంధ్రలో ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతోంది కూటమి ప్రభుత్వం.
Also Read: నెల రోజుల్లో పెళ్లి.. కిలో బంగారం, 3 కిలోల వెండి, పట్టుచీరలు, రూ.20 లక్షలు దోపిడి
భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే..
భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే.. ఉత్తరాంధ్రలో టూరిజం బాగా డెవలప్ కానుంది. విజయనగరం జిల్లా సమీపంలోని టూరిస్ట్ స్పాట్లకు.. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలు పెరుగుతాయి. దాంతో.. హోటల్స్, రిసార్ట్స్, రెస్టారెంట్ల లాంటి హాస్పిటాలిటీ రంగం డెవలప్ అవుతుంది. మౌలిక సదుపాయాల కల్పనలోనూ ఊహించని మార్పులొస్తాయ్. రోడ్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, కరెంట్ సప్లై లాంటివన్నీ మెరుగుపడతాయి. మొత్తంగా.. భోగాపురం ఎయిర్పోర్ట్ విజయనగరం జిల్లాని ఓ ముఖ్యమైన ఎకనమిక్ జోన్గా మార్చి.. ఆ ప్రాంత సమగ్ర అభివృద్ధికి బూస్టర్లా మారనుంది.