AP News: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా, మంగళగిరి పట్టణంలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అక్కడి కూడలిలో ప్రతిష్ఠించిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు విగ్రహాన్ని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగడంతో, ఈ చర్యను అడ్డుకునేందుకు యాదవుల సంఘాలు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
ఈ విగ్రహం తొలగింపు ప్రక్రియ అంతా కోర్టు ఆదేశాల మేరకే జరుగుతుందన్నారు. అంతేకాకుండా మంగళగిరిలోని కృష్ణుడి విగ్రహం నిబంధనలకు విరుద్ధంగా ఉందని, దానిని తొలగించాలని కోరుతూ మంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు, విగ్రహాన్ని తొలగించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల అమలులో భాగంగానే, మున్సిపల్ సిబ్బంది విగ్రహం తొలగింపు పనులను ప్రారంభించారు.
అయితే కోర్టు ఆదేశాలు వచ్చినప్పటికీ, స్థానికుల అభ్యంతరాల దృష్ట్యా ఈ విగ్రహాన్ని తొలగించడం మున్సిపల్ సిబ్బందికి అంత సులభం కాలేదు. విగ్రహం తొలగింపు పనులు ప్రారంభించిన వెంటనే, స్థానికులు, యాదవ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వారు మున్సిపల్ సిబ్బందిని అడ్డుకుని, నిరసన తెలియజేశారు.
ఈ విగ్రహంపై తమకు ఎంతో భక్తి, విశ్వాసం ఉన్నాయని యాదవ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విగ్రహాన్ని కదిలించేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదంటూ వారు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణుడి విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించడానికి వీలు లేదంటూ నినాదాలు చేస్తూ, మున్సిపల్ సిబ్బంది చుట్టూ గుమిగూడారు.
Also Read: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కింద పడి 11 ఏళ్ల బాలుడు మృతి.
దీంతో అక్కడి ప్రాంతం అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను శాంతింపజేయడానికి, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే, ఆందోళనకారులు తమ డిమాండ్పై పట్టుబట్టడంతో, ఇందిరానగర్ ప్రాంతంలో తీవ్ర తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.