Kurnool News: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఓ నకిలీ బాబా క్షుద్ర పూజల డ్రామాతో అమాయక దంపతుల నుంచి ఏకంగా రూ. 3.50 లక్షలు బురిడీ కొట్టించిన ఘటన కలకలం రేపింది. ఆదోని బైచిగేరి ప్రాంతానికి చెందిన దుర్గాసింగ్ అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్రం పెబ్బేరుకు చెందిన వెంకటయ్య పద్మ బాధితులు. ఈ దంపతులు ఉండవల్లి వాసులు. వీరు పెబ్బేరులో హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.
గతంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ దంపతులు, దుర్గాసింగ్ను దేవుడు వస్తాడని స్థానికులు చెప్పడంతో ఆదోని వెళ్లి పూజలు చేయించుకున్నారు. బైచిగేరి కేంద్రంగా ఉన్న దుర్గాసింగ్ వద్దకు పీర్ల స్వామి పైలేక వస్తారని తెలియడంతో ఈ దంపతులు అతడిని ఆశ్రయించారు. ఇదే అదునుగా తీసుకున్న దుర్గాసింగ్ బాబా, వారి బలహీనతను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశాడు. దంపతులు ప్రాణహాని ఉందంటూ పెద్ద మొత్తంలో డబ్బులు గుంజాడు.
మోసగాడు దుర్గాసింగ్ బాధితుల పొలంలో నిధి ఉందంటూ, ఆ నిధిని బయటకు తీస్తే తమకు ముప్పు వాటిల్లుతుందని నమ్మబలికాడు. అంతేకాక, వారి స్వగ్రామమైన ఉండవల్లిలో అర్ధరాత్రి పొలంలో క్షుద్ర పూజలు నిర్వహించాడు. ఆ పూజల అనంతరం అక్కడ అమ్మవారి విగ్రహం ఉందని.. ఆ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటే దంపతులకు అరిష్టం కలుగుతుందని భయపెట్టాడు. ఈ విగ్రహం కొనడానికి విదేశాల నుంచి కొందరు ఢిల్లీ వస్తున్నారని చెప్పి, బాధితులను చాలాసార్లు ఢిల్లీకి తీసుకెళ్లి తిప్పించాడు. ఇదంతా కేవలం వారిని మభ్య పెట్టేందుకే.
తాము మోసపోయామని గ్రహించిన వెంకటయ్య పద్మ దంపతులు, తమ డబ్బు తిరిగి ఇవ్వాలని బాబాను కోరారు. దీనికి ఆ నకిలీ బాబా దుర్గాసింగ్ అంగీకరించకపోగా.. మరింత బెదిరింపులకు పాల్పడ్డాడు. తమ గ్రామంలోకి అడుగుపెడితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. మోసంపై ఫిర్యాదు చేశారు. అంతేకాక, ఆదోని ఎమ్మెల్యే పార్థసారధికి సైతం కంప్లయింట్ చేశారు. క్షుద్ర పూజల పేరుతో నమ్మించి డబ్బు దోచుకున్న ఈ నకిలీ బాబా బాగోతంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.
ALSO READ: MS Dhoni: పెళ్లంటే సర్గం కాదు నరకమే… ధోని సంచలన వ్యాఖ్యలు