AP Politics: ఇండిగో సంక్షోభంలో టీడీపీ చిక్కుకుందా? ఈ అంశంపై ఓ జాతీయ ఛానెల్కు టీడీపీ ప్రతినిధులు మసాలా ఇచ్చారా? ఈ క్రమంలో మంత్రి లోకేష్ని వైసీపీ టార్గెట్ చేసిందా? చివరకు సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారా? రాత్రి ఆ ఛానెల్ నిర్వహించిన డిబేట్కి టీడీపీ నుంచి నేతలు ఎందుకు హాజరుకాలేదు? దీన్ని తమకు అనుకూలంగా మలచుకునే పనిలో వైసీపీ పడిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇండిగో సంక్షోభం టీడీపీని టచ్ చేసింది
న్యూస్ ఛానెళ్లకు మసాలా ఇవ్వకూడదని అధినేతలు.. పార్టీ ప్రతినిధులకు పదేపదే చెబుతుంటారు. కొందరు నేతలు అత్యుత్సాహం వల్ల ఇబ్బందులు పడిన.. పడుతున్న సందర్భాలు లేకపోలేదు. చివరకు టీడీపీ నేతలు అదే చేశారు. ఇండిగో సంక్షోభంపై ఓ జాతీయ ఛానెల్ టీవీ డిబేట్ పెట్టింది. టీడీపీ అధికార ప్రతినిధి ఒకరు ఆ ఛానెల్కు కావాల్సినంత మసాలా ఇచ్చేశారు.
దీంతో ఆ ఛానెల్ పదేపదే ఆ ఇష్యూని రైజ్ చేయడం మొదలుపెట్టింది. దీన్ని వైసీపీ అందుకోవడం, టీడీపీపై ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టింది. ఈ వ్యవహారంపై గడిచిన నాలుగు రోజులుగా మీడియాలో చర్చకు రావడంతో సోమవారం ఈ ఇష్యూపై నేరుగా సీఎం చంద్రబాబు స్పందించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆ ఛానెల్ డిబేట్ని బాయ్కట్ చేసిన టీడీపీ
నాలుగైదు రోజుల కిందట ఓ జాతీయ ఛానెల్.. ఇండిగో సంక్షోభంపై డిబేట్ నిర్వహించింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. విమానయానశాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నుంచి అధికార ప్రతినిధి ఒకరు డిబేట్కు హాజరయ్యారు. ఇండిగో సంక్షోభంపై మాట్లాడుతున్న సమయంలో మంత్రి రామ్మోహన్ నాయుడు అనబోయి.. పొరపాటున మంత్రి లోకేష్ పరిశీలన చేస్తున్నారంటూ నోరు జారారు.
ఈ విషయాన్ని పట్టుకుని హూ ఈజ్ లోకేష్ అంటూ పదే పదే ఆ ఛానెల్ ప్రశ్నించింది. ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకుంది వైసీపీ. ఆ మాటల క్లిప్పుని పదే పదే సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టింది. మీడియా ముందుకొచ్చిన మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్, టీడీపీ ఎంపీ తెలుగువారి పరువు తీశారంటూ ధ్వజమెత్తారు. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ALSO READ: ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో మంత్రి లోకేష్ పర్యటన
సంక్షోభం నేపథ్యంలో ఇండిగో ఎయిర్లైన్స్పై దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇప్పటికే పలు విమానాలను ఆ సంస్థ రద్దు చేసింది. గడిచిన ఐదారు రోజులుగా ఈ పరిస్థితి కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆ జాతీయ ఛానెల్ మళ్లీ ఇదే అంశంపై డిబేట్ నిర్వహించింది.
టీడీపీ నుంచి ఎవరూ హాజరుకాలేదు. ఖాళీ ఛైర్ ఉంచి డిబేట్ కంటిన్యూ చేసింది. ఇండిగో సంక్షోభంపై తాము అడుగుతున్న కఠినమైన ప్రశ్నలకు టీడీపీ సమాధానం చెప్పలేదంటూ తాటికాయంత అక్షరాలతో బ్రేకింగ్ వేసింది. దాదాపు గంటపాటు ఆ చర్చ అలాగే సాగింది. ఈ వ్యవహారంపై రాజ్యసభలో మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో వివరణపై ప్రధాని మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఇష్యూని గడిచిన నాలుగైదు రోజులుగా హ్యాండిల్ చేసిన విధానం బాగుందని కొనియాడినట్టు తెలుస్తోంది. విమర్శలు ఏ మాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నట్లు తెలుస్తోంది.