Pithapuram, Kakinada City Violence plan on Counting Day: ఆంధ్రప్రదేశ్లో మళ్లీ టెన్షన్? ఫలితాల వెల్లడి రోజు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ చాలామందిని వెంటాడుతోంది. నిఘా వర్గాల సమాచారం మేరకు రెండు నియోజకవర్గాల్లో హింస జరిగే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఒకటైతే, మరొకటి కాకినాడ.
ఏపీలో శాసనసభతోపాటు పార్లమెంటు ఎన్నికలకు ఒకే విడత మే 13న ఎన్నికలు జరిగాయి. దాని తర్వాత సమస్యాత్మక ప్రాంతాల్లో హింస రేగింది. ఎన్నికల ముగిసిన తర్వాత అభ్యర్థులపై దాడులు, ఆఫీసులు ధ్వంసం చేయడం జరిగింది. పరిస్థితి గమనించిన ఎన్నికల సంఘం ఆయా నియోజకవర్గాల్లో 144 సెక్షన్ విధించింది. అంతేకాదు పోలింగ్ తర్వాత బలగాలు అక్కడే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు శాంతించాయి.
తాజాగా నిఘా వర్గాల నుంచి ఎన్నికల సంఘానికి కీలక నివేదిక అందినట్టు వార్తలు వస్తున్నాయి. కౌంటింగ్ నేపథ్యంలో పిఠాపురం, కాకినాడ నియోజకవర్గాల్లో హింస చోటు చేసుకునే అవకాశముందన్నది దాని సారాంశం. కాకినాడ సిటీ నియోజకవర్గంలోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేట ప్రాంతాల్లో ఘర్షణలు జరగవచ్చని తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాలపై ఈసీ కన్నేసింది. అక్కడ బలగాలను మొహరించింది.
2019 ఎన్నికల సమయంలో ఆయా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని నిఘా వర్గాలు గుర్తుచేశాయి. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఘర్షణలు చోటు చేసుకునే అవకాశముందని తెలిపింది. దీంతో ఎన్నికల సంఘం సీఐఎస్ఎఫ్, సీఆర్పీపీఎఫ్, ఏపీఎస్పీ, లోకల్ పోలీసులను మొహరించింది. ఎలాంటి ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.
ALSO READ: సిట్ నివేదికలో కీలకాంశాలు, సాయంత్రం..
ఎన్నికల సమయంలో కాకినాడ వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి- జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ నివేదిక రావడంతో ఈసీ అలర్ట్ అయ్యింది. కౌంటింగ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.