గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంలో జగన్ పాత్ర ఎంత? వైసీపీ నేతల చేతగాని తనం ఎంత? ఈ రెండిటిపై చర్చ జరగకుండా ఆ పార్టీ ఈవీఎంలపై నెపం నెట్టేసింది. ఓ దశలో ప్రజలే పలావు వద్దని బిర్యానీకోసం వెళ్లారంటూ జగన్ సర్దిచెప్పుకున్నారు. తీరా ఇప్పుడు ప్రజలకు బుద్ధొచ్చిందని, తమని తిరిగి ఎన్నుకోనందుకు పశ్చాత్తాప పడుతున్నారని సెలవిచ్చారు జగన్. అంతే కాదు, ప్రజల్లో మార్పు వచ్చిందని, పార్టీ నేతల్లో కూడా దానికి తగ్గట్టుగా మార్పు రావాలంటూ హితబోధ చేశారు.
తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతోసమావేశం https://t.co/HmeVoTPl4k
— YSR Congress Party (@YSRCParty) July 29, 2025
తలంటిన జగన్..
పార్టీ నేతలతో జరిగిన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ లో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలు మరింత హుషారుగా ఉండాలని చురకలంటించారు. చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తు చేస్తూ అనే పేరుతో వైసీపీ చేపట్టిన కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నేతలెవరూ ఉత్సాహంగా పాల్గొనడం లేదు. ఇదే విషయాన్ని పార్టీ మీటింగ్ లో గుర్తు చేశారు జగన్. పార్టీ నాయకులు ఇంకొంత ఎక్కువగా ఇన్వాల్వ్ కావాలన్నారు. మరింత అగ్రెసివ్ రోల్ ప్లే చేయాలన్నారు. ఎన్నికల తర్వాత జగన్ తొలిసారి పార్టీ నాయకులపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. కెమెరాలు ఉండటంతో ఆయన సుతిమెత్తగా హెచ్చరించారు. ఆఫ్ ది రికార్డ్ జగన్ కాస్త గట్టిగానే నేతలకు తలంటారని టాక్. అయితే ఈ విషయంలో జగన్ ఇప్పటికే ఆలస్యం చేశారని ఓ వర్గం భావిస్తోంది. సీనియర్ నేతలెవరూ అధికారం కోల్పోయిన తర్వాత కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, వేధింపులకు గురవుతున్నామని చెప్పినా సాయం అందడం లేదనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ దశలో కార్యకర్తల్ని కలుపుకొని వెళ్లాలంటూ కాస్త గట్టిగానే నేతలకు హితబోధ చేశారు జగన్.
ఎందుకీ నీరసం..?
అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని కాస్త ఎక్కువగా టార్గెట్ చేసిన వారంతా ఇప్పుడు వివిధ కేసుల్లో ఇరుక్కుని జైలులో కాలక్షేపం చేస్తున్నారు. ఈ దశలో మరీ అంత ఫోకస్ కావడం ఎందుకని చాలామంది సైలెంట్ అయ్యారు. గతంలో అగ్రెసివ్ గా ఉన్న ఒకరిద్దరు మైకుల ముందు ఆవేశంగా మాట్లాడుతున్నారు. అయితే నేతలెవరూ జనంలోకి వెళ్లడానికి సాహసం చేయడం లేదు. చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తు చేస్తూ అని జరుగుతున్న కార్యక్రమం కూడా తూతూమంత్రంగానే నడుస్తోందని అంటున్నారు. వైసీపీ మద్దతుదారుల ఇంటికి వెళ్లి.. కూటమి ప్రభుత్వాన్ని వారితో తిట్టించి ఆ వీడియోలు వైరల్ చేసుకుంటున్నారు. జగన్ అధికారంలోకి రావాల్సిందేనంటూ పబ్లిక్ అనుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తల్ని కూడా వండి వారుస్తున్నారని తెలుస్తోంది. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉందనేది జగన్ దగ్గర రిపోర్ట్ ఉంది. అందుకే ఆయన సీనియర్లు మరింత ఎక్కువగా ఇన్వాల్వ్ కావాలని సూటిగా చెప్పారు. ఇప్పటి వరకు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకుండా, కేవలం ఇంటికే పరిమితమై, ఈవెనింగ్ వాక్ లాగా కెమెరాలముందుకొచ్చేవారిని జగన్ హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి జనంలోకి వెళ్లి హడావిడి చేయడం ఎందుకని వైసీపీ నేతలు భావించినట్టు ఉన్నారు. అయితే ఉనికికోసం కచ్చితంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అంటున్నారు జగన్. ఆయన సీరియస్ గా చెప్పిన తర్వాత అయినా నేతల వ్యవహారంలో మార్పులు వస్తాయేమో చూడాలి.