YS Jagan mohan reddy latest news(Andhra news today) : వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన 4 ఏళ్లు పూర్తైన వేళ.. విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్ను సీఎం వైఎస్ జగన్ దంపతులు సందర్శించారు. వారికి ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు స్వాగతం పలికారు.
మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు సీఎం జగన్ నివాళులర్పించారు. అక్కడ నూతనంగా నిర్మించిన భవనాన్ని అనాథ పిల్లలతో కలిసి ప్రారంభించారు. నిర్మల్ హృదయ్ భవన్లో ఆశ్రయం పొందుతున్న పిల్లలతో సీఎం జగన్ , భారతి ముచ్చటించారు.
మరోవైపు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకోవడంతో.. పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నాయి. వైసీపీ కేంద్ర కార్యాలయంలో సేవా కార్యక్రమాలను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేసి ప్రారంభించారు. జగన్ నాలుగేళ్ల పాలన ఒక చరిత్ర అని సజ్జల అన్నారు. ఎన్నికలకు ముందు గుంట నక్కలు పగటి వేషాలు వేసుకొని వస్తున్నాయని ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి విమర్శలు చేశారు.
ప్రజలను భ్రమల్లో పెట్టి ప్రతిపక్షనేత మళ్లీ అధికారంలోకి రావటానికి ప్రయత్నిస్తున్నారని సజ్జలు మండిపడ్డారు. కోటి 60 లక్షల కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. చెప్పుకోవటానికి చంద్రబాబుకు ఒక పథకం అయినా ఉందా? అని ప్రశ్నించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల్లో వెన్నుపోట్లు, పక్క పోట్లు అన్నీ ఉంటాయని సజ్జల చురకలు అంటించారు. వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.