Manish sisodia : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు షాక్ తగిలింది. ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి దినేశ్ కుమార్ శర్మ మంగళవారం తీర్పునిచ్చారు.
సిసోడియాపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని హైకోర్టు పేర్కొంది. ఆయన బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని తెలిపింది. అందువల్ల బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక బెయిల్ కోసం సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయని ఆప్ వర్గాలు వెల్లడించాయి.
ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు సిసోడియాను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో సిసోడియాను తిహార్ జైలుకు తరలించారు.
ఇటీవల సిసోడియా కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 1 వరకు పొడిగించింది. అయితే జైల్లో ఆయనకు కుర్చీ, టేబుల్, పుస్తకాలు అందించాలని ఆదేశించింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఈడీ కూడా సిసోడియాపై కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకుంది.