అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ రాజకీయాల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. మున్సిపల్ కౌన్సిల్ చివరి సమావేశంలో చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. తన పదవీ కాలం ముగుస్తున్న తరుణంలో నిర్వహించిన ఈ వీడ్కోలు సమావేశంలో ఆయన కంటతడి పెట్టుకున్నారు. దేవాలయం లాంటి ఈ కార్యాలయాన్ని వదిలి వెళ్లడం బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా ఈ కార్యాలయం కేంద్రంగా తాడిపత్రి అభివృద్ధి కోసం చేసిన కృషిని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
తాడిపత్రి ప్రజలను దేవుళ్లుగా అభివర్ణించిన జేసీ ప్రభాకర్ రెడ్డి వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని స్పష్టం చేశారు. పట్టణ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించానని పేర్కొన్నారు. భవిష్యత్తుపై తనకున్న విజన్ను వివరిస్తూ 2027 నాటికి తాడిపత్రి పేరు ప్రపంచ పటంలో నిలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ స్థాయి అభివృద్ధిని పట్టణంలో తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధికారులు మద్దతుతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చామని ఆయన వివరించారు.
రానున్న మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చే రెండు వేల రూపాయలకు ఆశపడి వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు అవకాశం ఇవ్వవద్దని కోరారు. భూ కబ్జాదారులు ముసుగులో ఉన్న వారికి ఓటు వేసి పట్టణ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని హెచ్చరించారు. కేవలం డబ్బు కోసం ఓటు వేస్తారో లేక తాడిపత్రి అభివృద్ధి కోసం కష్టపడుతున్న నాయకులకు ఓటు వేసి గెలిపిస్తారో మీరే ఆలోచించుకోవాలని సూచించారు. ప్రజలే నిజమైన న్యాయ నిర్ణేతలని ఆయన అభిప్రాయపడ్డారు.
తాడిపత్రి క్షేమం కోరే మంచి వ్యక్తులను మాత్రమే కౌన్సిల్కు పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిరంతరం ప్రజా సేవలో ఉండే వారికే పట్టం కట్టాలని కోరారు. అభివృద్ధి ఆగకూడదంటే సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం చాలా అవసరమని స్పష్టం చేశారు. కార్యాలయం నుండి బయటకు వెళ్తున్నప్పటికీ తన హృదయం ఎప్పుడూ తాడిపత్రి ప్రజల కోసమే తపిస్తుందని భావోద్వేగంతో ప్రసంగాన్ని ముగించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కన్నీరు పెట్టుకోవడం చూసి అక్కడున్న కౌన్సిలర్లు తోటి నాయకులు కూడా ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి వెళ్లిపోయారు.
ALSO READ: Congress Plans: హైదరాబాద్లో హస్తం గేమ్ ప్లాన్ ఇదేనా? గ్రేటర్ ఎన్నికలకు 300 అభ్యర్థులపై ఫోకస్!