JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, వైసిపి నేతల తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదంటూ మండిపడ్డారు.
ప్రజాస్వామ్యం ఎక్కడుంది?
ఎస్పీ కార్యాలయం ముందు వైసీపీ నేతలు మూడు గంటల పాటు ధర్నా చేయగలిగారంటే, అది రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం ఉండటం వల్లే సాధ్యమైందని జేసీ ప్రభాకర్ రెడ్డి గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు లేవని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘గతంలో టీడీపీ మహిళా కార్యకర్తలపై అన్యాయంగా 307 కేసులు పెట్టడం ప్రజాస్వామ్యమా? మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏకంగా నా ఇంట్లోకి చొరబడటం ప్రజాస్వామ్యమా? ఇప్పటికీ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తామనడం ఏ రకమైన ప్రజాస్వామ్యం?’ అని ఆయన నిలదీశారు. పెద్దారెడ్డి నేర చరిత్రకు లెక్కే లేదని జేసీ ఆరోపించారు.
అవినీతి, అరాచకాలపై ఫైర్
వైసీపీ ఐదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి ఏంటని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి సాగు, సరఫరా వెనుక పూర్తిగా వైసీపీ నేతల హస్తమే ఉందన్నారు. యల్లనూరు మండలం కొడవండ్లపల్లిలో ఏకంగా దేవాలయ హుండీ డబ్బులను కూడా వైసీపీ నేతలు సొంతానికి వాడుకున్నారని, దీనిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైందని ఆయన వెల్లడించారు. అంతేకాదు, గత చరిత్రను గుర్తు చేస్తూ.. అనంత వెంకట్రామిరెడ్డి తండ్రిని కొట్టించింది కేతిరెడ్డి ఫ్యామిలీ కాదా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: బండి సంజయ్ కొడుకు భగీరథ్ బెయిల్ ముగింపు.. మళ్లీ చర్లపల్లి జైలుకు!
కార్యకర్తలకు అండగా ఉంటాం.. తమ్ముళ్లూ మేల్కొనండి!
చంద్రబాబు నాయుడు, లోకేష్ల గురించి వైసీపీ నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని జేసీ హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడిన ఆ 24 మంది వైసీపీ నాయకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘తెలుగుదేశం కార్యకర్తలకు మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాం. కార్యకర్తలపై దాడులు జరిగితే ఊరుకోం. కానీ, టీడీపీ కార్యకర్తలంతా ఇప్పటికైనా మేల్కోవాలి. సరిగ్గా మూడేళ్ల తర్వాత మళ్లీ వైసీపీ వాళ్లు కొట్టే పరిస్థితి రావచ్చు, కాబట్టి అలసత్వం వద్దు’ అని పిలుపునిచ్చారు. చంద్రబాబు, లోకేష్ అనుమతితోనే ఈ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.