Kakinada Fire Accident: కాకినాడ జిల్లా వేట్లపాలెం జి.మేడపాడు మధ్య గల బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో 18 మంది కార్మికులు సజీవ దహనమైనట్లు సమాచారం. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడటం అక్కడి భీభత్సానికి అద్దం పడుతోంది. మంటల్లో మరో 15 మంది వరకు కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇదే ప్రాంతంలో పేలుళ్లు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే దట్టమైన పొగ.. మంటలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్సులు సిద్ధం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారీ సాగుతుందా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ భారీ ప్రాణనష్టం ఆ ప్రాంతంలో తీరని విషాదాన్ని నింపింది.