Kesineni nani latest news(AP political news): కేశినేని నాని. బెజవాడ్ కింగ్..అనుకుంటారాయన. ప్రస్తుతం టీడీపీ ఎంపీగా ఉన్నారు. పార్టీలో ఉండీఉండనట్టు ఉంటున్నారు. చంద్రబాబు షేక్ హ్యాండ్ ఇస్తే కూడా తీసుకోకుండా చేయి విదిలించుకున్న రెబెల్ లీడర్. ఇటీవల తరుచుగా సొంతపార్టీనే గిల్లుతున్నారు. చంద్రబాబుకే సవాళ్లు విసురుతున్నారు. వైసీపీకి దగ్గరవుతున్నట్టు కనిపిస్తున్నారు. ఇదంతా కావాలనే చేస్తున్నారా? నాని రచ్చ వెనుక వ్యూహం ఉందా? చిన్నికి చెక్ పెట్టేందుకే చిటపటలాడుతున్నారా? అధినేతపైనే ధిక్కారస్వరం ఎందుకు వినిపిస్తున్నారు? ఇవన్నీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్.
లేటెస్ట్గా మరోసారి హాట్ కామెంట్స్ చేశారు కేశినేని నాని. టీడీపీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతానని సవాల్ చేశారు. ఏ పిట్టలదొరకు సీటిచ్చినా డోంట్ కేర్ అంటున్నారు. తనకు ట్రాక్ రికార్డ్ ఉందని.. తానే గెలుస్తానని ధీమాగా చెబుతున్నారు. ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధమని.. ఏ పార్టీ అయినా ఓకేనంటూ.. మరింత కలకలం రేపారు. ఇంతకుముందు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. విజయవాడ అభివృద్ధి కోసం ముళ్లపందితోనైనా కలుస్తానంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలతో సిద్దాంతపరమైన వైరమే తప్పా.. వ్యక్తిగత వైరం లేదన్నారు.
అంటే? ఏ పార్టీ అయినా ఓకే అంటే? టీడీపీ కాకపోయినా ఓకే అన్నట్టేగా? మరి, కేశినేని నాని వైసీపీలో చేరుతారా? ఆ పిట్టలదొర కేశినేని చిన్నినేనా? ఇలా చర్చ..రచ్చ నడుస్తోంది. ఇదే సమయంలో వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మరో ఆసక్తికర కామెంట్ చేశారు. కేశినేని నాని వైసీపీలో చేరడంపై పార్టీలో చర్చించి చెబుతామంటూ కలకలం రేపారు.
అసలేం జరుగుతోంది? బెజవాడ రాజకీయాల్లో ఏం నడుస్తోంది? కేశినేని కుటుంబంలోనే కోల్డ్ వార్. ఇటీవల నాని రెబెల్ వాయిస్ పెంచడంతో.. ఆయన సోదరుడు చిన్నిని ఎంకరేజ్ చేస్తోంది పార్టీ అధిష్టానం. దేవినేని ఉమా.. చిన్నికి సపోర్ట్గా ఉంటున్నారు. ఆయనే వెనుకుండి చిన్నిని నానిపైకి ఉసుగొల్పుతున్నారని అంటున్నారు. అసలే కేశినేని నాని.. తన జోలికొస్తే ఊరుకుంటారా? అందుకే, దేవినేని ఉమాను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. మైలవరంలో వేలు పెడుతున్నారు. నందిగామలోనూ కాలు పెడుతున్నారు.
మొన్నామధ్య నందిగామ వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్తో వేదిక పంచుకొని ఆయన్ను తెగపొగిడేశారు. ఇప్పుడు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్తో కలిసి కనిపించారు. టీడీపీ ఎంపీకి.. వైసీపీ ఎమ్మెల్యేలతో ఏం పని? ప్రతిపక్షంలో ఉంటూ.. అధికార పార్టీని ప్రశంసించడం ఎందుకు? ఈయన ఇంత రచ్చ చేస్తుంటే.. అధిష్టానం ఎందుకు భరిస్తోంది?
చిన్నితో వైరమే నాని ఇలా రచ్చ చేసేందుకు కారణం అంటున్నారు. నందిగామ టీడీపీ ఇంచార్జ్గా ఉన్న సౌమ్య.. కేశినేని చిన్ని శిబిరంలో ఉన్నారు. అందుకే.. డైరెక్ట్గా సౌమ్యను, ఇన్డైరెక్ట్గా చిన్నిని కార్నర్ చేసేందుకే ఇలా కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారని చెబుతున్నారు.
ఇక, దేవినేని ఉమా, కేశినేని నానిల గొడవ బెజవాడవాసులందరికీ తెలిసిందే. చంద్రబాబు ఎన్నిసార్లు సర్దిచెప్పినా తగ్గేదేలే అంటున్నారు. చిన్నికి ఉమా సపోర్ట్ చేయడంతో నాని మరింత రగిలిపోతున్నారు. అందుకే, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్తోనూ సఖ్యతగా ఉంటూ.. దేవినేనికి ఎర్త్ పెడుతున్నారు. ఆయనిలా ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలకు వంతపాడుతూ.. సొంతపార్టీ నేతలను దెబ్బకొట్టే చర్యలకు పాల్పడటం పార్టీ అధిష్టానానికి మింగుడుపడటం లేదు. వేటు వేద్దామంటే.. ఆయనేమీ చిన్నాచితకా నాయకుడు కాదాయే. ఎంపీగా అనేక నియోజకవర్గాల్లో పట్టుంది. కావలసినంత అర్థ, అంగ బలం ఉంది. అందుకే, చూసీచూడనట్టు ఉంటోంది పార్టీ. అధిష్టానం వీక్నెస్ చూసి మరింత రెచ్చిపోతున్నారు నాని. కేవలం చిన్ని, ఉమాలను టార్గెట్ చేసేందుకే వైసీపీతో కలిసినట్టు చేస్తున్నారా? కేశినేని పార్టీని వీడుతారా? వీడరా? వైసీపీలోకి వెళ్దామనుకున్నా.. జగన్ రానిస్తారా? ఎంపీ టికెట్ ఇస్తారా? టీడీపీ టికెట్ ఇవ్వకపోతే కదా తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటున్నారు.. ఒకవేళ టికెట్ ఇస్తే? టీడీపీలోనే ఉంటారా? ఇలా కేశినేని నాని ఎపిసోడ్ క్లారిటీతో కూడిన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది.