Kethireddy: ఆపరేషన్ సింధూర్పై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి మాటలు దేశ భద్రత అంశాన్ని తక్కువచేసేలా ఉన్నాయంటూ.. బీజేపీ శ్రేణులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన కేతిరెడ్డి, ట్రంప్ ట్వీట్ చేసేంత వరకు యుద్ధం ముగిసిందని మనకు ఎవరికీ తెలియదు. ఏదో జరిగిపోతుందని అనుకున్నాం కానీ ఎవరికి తెలియకుండా ఆపరేషన్ సింధూర్ ముగిసింది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు డిల్లీ బ్లాస్ట్ ఏమైందో ఇప్పటికీ ప్రజలకు పూర్తిగా తెలియదు అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి.
కేతిరెడ్డి మాటలు వెలుగులోకి వచ్చిన వెంటనే.. బీజేపీ శ్రేణులు తీవ్రంగా స్పందించింది. దేశ సైన్యం నిర్వహించిన ఆపరేషన్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలక అంశమని, అలాంటి ఆపరేషన్పై రాజకీయ లాభనష్టాల కోసం మాట్లాడటం సరికాదని వారు అంటున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా తప్పు సంకేతాలు పంపుతుందని విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో బీజేపీ నాయకులు కేతిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. దేశ భద్రతపై రాజకీయం చేయడం మానుకోవాలి, సైనికుల త్యాగాలను తక్కువచేసే వ్యాఖ్యలు సహించబోం అంటూ పోస్టులు పెడుతున్నారు. కొందరు బీజేపీ నేతలు కేతిరెడ్డిని నేరుగా ట్యాగ్ చేస్తూ ఘాటైన ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద రాజకీయ వాగ్వాదంగా మారింది.
Also Read: తిరుపతిలో హై టెన్షన్.. మద్యం మత్తులో ఆలయ గోపురం పైకెక్కి వ్యక్తి హల్చల్!
తాజాగా కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఒకవైపు మళ్లీ రాజకీయంగా చురుగ్గా మారుతున్నారన్న చర్చ జరుగుతుండగా, మరోవైపు ఆయన వ్యాఖ్యలు బీజేపీకి కొత్త అస్త్రంగా మారినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ అంశం మరింత పెద్ద రాజకీయ వివాదంగా మారే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.