AP News : Big Tv Live Originals: రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై ఏపీ సర్కారు సీరియస్గా ఉంది. ఇప్పటికే కేటాయించి ల్యాండ్లో 15 ఎకరాలను వెనక్కి తీసుకుంది. స్టూడియో నిర్మాణం కోసం స్థలం ఇస్తే.. అందులో రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి అమ్ముకోవాలని చూశారు. గత వైసీపీ సర్కారు హయాంలో పార్టీ పెద్దలు వెనుకుండి ఈ తతంగమంతా నడిపించారని అంటారు. కూటమి సర్కారు వచ్చాక.. సీన్ మారింది. అడ్డగోలుగా అమ్ముకుంటామంటే కుదరదని రామానాయుడు స్టూడియో యాజమాన్యానికి నోటీసులు ఇచ్చింది. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ ఆ నోటీసులకు వివరణ ఇవ్వాల్సి ఉంది. అసలు.. రామానాయుడు స్టూడియో ల్యాండ్స్ ఎలా పక్కదారి పట్టాయి? ఆ భూముల్లో రియల్ వెంచర్ ఎలా పుట్టుకొచ్చింది? పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? ఎలా ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? తెర వెనుక ఉన్నది ఎవరు? ఇలా పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. అందులో భాగంగా కీలక పత్రాలు చేతికొచ్చాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి…..
ఎప్పుడేం జరిగిందంటే..
స్టూడియో నిర్మాణం కోసం తీసుకున్న భూములను రియల్ ఎస్టేట్ వెంచర్ కింద మార్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు రామానాయుడు స్టూడియో మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ బాబు. మధురవాడ సర్వే నంబర్ 397/P లో రామానాయుడు స్టూడియోలో భాగంగా ఉన్న 15 ఎకరాలను లే అవుట్ కింద మార్చేందుకు అనుమతి పొందారు. దీనికి సంబంధించిన పత్రాలను బిగ్ టీవీ సంపాదించింది. సినీ పరిశ్రమ ప్రోత్సాహానికి, ఉపాధి కల్పన కోసం సురేష్ ప్రొడక్షన్స్కు భూమి కేటాయించింది అప్పటి ప్రభుత్వం. విశాఖలో 34.44 ఎకరాల భూమిని కేటాయిస్తూ 2003లో జీవో జారీ అయ్యింది. ఎకరాకు 5 లక్షల చొప్పున అతి తక్కువ ధరకు భూమి కేటాయించింది. ఆ భూమిని జనవరి 5, 2010న రిజిస్ట్రేషన్ చేయించుకుంది సురేష్ ప్రొడక్షన్స్. ఇప్పుడదే భూమిని కమర్షియల్గా మార్చే ప్రయత్నం జరిగింది. ఇందులోని 15 ఎకరాల్లో భారీ విల్లాలు నిర్మించి అమ్మాలనేది సురేష్ బాబు ప్లాన్గా కనిపిస్తోంది.
వారంలోనే పర్మిషన్లు..
స్టూడియోలో భాగంగా ఉన్న 15 ఎకరాలను.. లే అవుట్ కింద మార్చేందుకు 2023 ఫిబ్రవరి 24న సురేష్ బాబు అప్లికేషన్ పెట్టారు. అదే ఏడాది మార్చి 2న అనుమతులు జారీ చేశారు అప్పటి జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు. కేవలం వారం వ్యవధిలోనే ఈ అనుమతులు రావడం ఆసక్తికరం. అంత త్వరగా ఎలా వచ్చాయి? ఆ అనుమతులు వెనుక ఆనాటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉందా? ముందే అన్నీ మాట్లాడేసుకుని.. ఆ తర్వాతే కాగితాలు ముందుకు కదిపారా? రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలనే ఆలోచన సురేష్ బాబుదేనా? ఆయనతో ఇంకెవరైనా బలవంతంగా ఆ పని చేయించారా? అనే దానిపై సర్కారు ఫోకస్ పెడుతోంది.
Also Read : విజయసాయికి సిట్ నోటీసులు.. లిక్కర్ స్కాంలో చిక్కులు..
సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన భూములను కమర్షియల్గా మార్చడంపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అందుకే ఈ భూములను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించి సురేష్బాబుకు నోటీసులు ఇచ్చింది.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.