ఏపీలో కూటమి సర్కార్లో భాగమైన ఓ ఎమ్మెల్యేపై ప్రస్తుతం లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ప్రతిపక్ష వైసీపీ నేతలు దాన్ని పెద్ద రాజకీయం చేస్తున్నారు. కూటమి సర్కారులో మహిళలకు అన్యాయం జరుగుతోందని, వారికి రక్షణ లేకుండా పోయిందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా, కూటమి సర్కార్ అధికారంలోకి రాకముందు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలను వారు ప్రస్తుతం గుర్తుచేస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలను చూడాలన్నా, వేధింపులకు గురిచేయాలన్నా ఒక్కొక్కరికి ఒంట్లో వణుకుపుట్టేలా తమ ప్రభుత్వం పనిచేస్తుంది.. అటువంటి వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్న ఉపేక్షించేది లేదని ఆనాడు చంద్రబాబు హెచ్చరించారు.ఆ క్లిప్స్ను వైసీపీ నేతలు ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు.
జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను ఆన్ లైన్ ద్వారా పరిచయం చేసుకుని, నంబర్ ఇచ్చి దగ్గరయ్యాడని..ప్రమోషన్ పేరిట తనను లొంగదీసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని పలుమార్లు అబార్షన్ చేయించారని ఓ మహిళా ఉద్యోగి ఆరోపించిన విషయం తెలిసిందే. తనతో చాట్ చేశాడని.. న్యూడ్ వీడియోలు పంపాలని కోరేవాడని.. న్యూడ్ పిక్స్ పెట్టేవాడని సైతం ఆమె మీడియా ముందుకు వచ్చి ఆరోపించారు.పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని.. గర్భం తీయించుకోలేదనని తనను ఇంటికొచ్చి కొట్టాడని ఆమె ప్రధానంగా ఆరోపించారు. అయితే, ఇందులో నిజమెంత? అనేది నేటికి ప్రశ్నార్థంగా మారింది. ఆ అమ్మాయి తన కొడుకును బ్లాక్ మెయిల్ చేస్తున్నదని.. డబ్బుల కోసం ఇలా చేస్తున్నదని ఎమ్మెల్యే తల్లి పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ సైతం తనకు ఆమెతో సంబంధం లేదని.. ఇదంతా ట్రాప్ అని ఆరోపించారు.
ప్రస్తుతం అరవ శ్రీధర్ వ్యవహారంపై వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున ఆరోపణలు చేస్తుండగా.. అందుకు కూటమి నేతలు సైతం బలంగానే కౌంటర్ ఇస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారంపై పోలీసుల విచారణ అనంతరం అన్ని విషయాలు వెలుగుచూస్తాయని అప్పటివరకు ఆగాలని కూటమి నేతలు కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ సైతం ఇప్పటివరకూ ఈఘటనపై స్పందించలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీధర్ ఫోన్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ముందు జనసేనానితో ఆయన సమావేశమై అసలేం జరిగిందో వివరించనున్నారని కూడా టాక్ వినిపిస్తున్నది.దీనిపై జనసేనాని ఏవిధంగా స్పందించనున్నారో తెలియాల్సి ఉన్నది.
Vizag-Janasena: జనసేన, టీడీపీ మధ్య కోల్డ్ వార్..!
ఇక వైసీపీ నేతల విమర్శలపై కూటమి నేతలు గట్టిగా బదులిస్తున్నారు. మీ హయాంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై లైంగిక ఆరోపణలు ఎలా వచ్చాయి…న్యూడ్ కాల్స్ చేసి దొరికిపోలేదా? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తున్నది. దీనికి తోడు మైనర్ బాలికలపై వేధింపులకు పాల్పడిన నేతలు వైసీపీలో ఉన్నారని.. కోడుమూర్ మాజీ వైసీపీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ బాలికను లైంగికంగా వేధించి అరెస్టు అయిన విషయం మరిచారా? అని నిలదీస్తున్నట్టు సమాచారం.దీనికి తోడు వైసీపీ సోషల్ మీడియాలో మహిళలను వేధింపులకు గురి చేసేలా పోస్టులు పెట్టిన వారిని, వేధించిన వారిపై కేసులు నమోదైన ఘటనలు గుర్తున్నాయా? అని సైతం ప్రశ్నిస్తున్నారు. మహిళలపై దారుణాలకు ఒడిగట్టిన పార్టీ వైసీపీ అని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. అలాంటి వారిపై నాడు చర్యలు తీసుకోని మాజీ సీఎం జగన్.. ఇప్పుడు అరవ శ్రీధర్ వ్యవహారంపై మాట్లాడటం, విమర్శించడం విడ్డూరంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.