Leopard Roaming: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శేషాచల అడవుల్లో చిరుత పులి సంచారం స్థానికంగా కలకలం రేపింది. సీఎం చంద్రబాబు స్వగ్రామం అయిన నారావారిపల్లె గ్రామం సమీపంలో చిరుత సంచరిస్తుండడంతో.. స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో నెమళ్ల కోసం చిరుత తరచూ వస్తోందని స్థానికులు అంటున్నారు. చిరుత సంచారం సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. చిరుత తరిమే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామం వైపు రాకుండా బాణాసంచా కాలుస్తూ శబ్దాలు చేస్తున్నారు.
అల్లూరి జిల్లా జీకేవీధి మండలం సప్పర్ల రెయిన్గేజ్ వద్ద బుధవారం సాయంత్రం చిరుత పులి సంచరించినట్టు కలకలం రేగింది. దీనిపై సీలేరు రేంజ్ అటవీశాఖాధికారి వెంకటరావు స్పందించారు. ఆయన ఆదేశాలతో డిప్యూటీ రేంజ్ అధికారి సతీశ్ ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది రెయిన్గేజ్ ప్రాంతాన్ని పరిశీలించారు. రెయిన్గేజ్ రోడ్డు పక్కనే చిరుత పాద ముద్రలను గుర్తించారు.
చిరుత పాదముద్ర రెయిన్గేజ్ నుంచి అటవీ మార్గంలో ఒడిశా వైపు వెళ్లిపోయినట్టు అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. ఈ మేరకు సీలేరు రేంజ్ అధికారి వెంకటరరావు ప్రకటించారు. సప్పర్ల, ధారకొండ ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచరిస్తుండడంతో… అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బైక్ లపై ఈ ప్రాంతంలో ఒంటరిగా ప్రయాణం చేయవద్దని సూచించారు. రెయిన్గేజ్ ప్రాంతానికి పర్యాటకులు ఒకరు, ఇద్దరు వెళ్లరాదని తెలిపారు.
Also Read: Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్.. క్రికెట్ బెట్టింగ్లో ప్రధాన అనుచరుడు అరెస్ట్