Manchu Manoj : ప్రముఖ నటుడు మోహన్ బాబు (Manchu Mohan Babu) తిరుపతి శ్రీవిద్యానికేతన్ యూనివర్సిటీ (Sri Vidhya Nikethan University) వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ యూనివర్సిటీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. ఇక అక్కడే మోహన్ బాబు, విష్ణు కూడా ఉండటంతో పరిస్థితి మరింత వివాదాస్పదంగా మారినట్లు తెలుస్తుంది. అయితే మంచు మనోజ్ ను లోపలికి రాకుండా విష్ణు బౌన్సర్ అడ్డుకోవడంతో.. మనోజ్ బౌన్సర్స్ రంగంలోకి దిగారు. దీంతో ఇరు బౌన్సర్స్ మధ్య మరోసారి వివాదం చెలరేగింది.
పండుగ వేళ మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం చెలరేగింది. తిరుపతి యూనివర్సిటీ వద్దకు మంచు మనోజ్ వచ్చే సమయానికి అక్కడే మోహన్ బాబు, విష్ణు ఉండటంతో పరిస్థితి అదుపుతప్పింది. మనోజ్ తన తాత నారాయణ స్వామి నాయుడు, నానమ్మ లక్ష్మమ్మల సమాధుల వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చానని చెబుతున్నప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది ఆయనను లోపలికి అనుమతించలేదు. గట్టిగా కేకలు వేస్తూ గేట్లు తీయాలని కోరారు. అయినప్పటికీ వాళ్లు అనుమతించకపోవటంతో వాగ్వాదానికి దిగడంతో గొడవ అదుపుతప్పింది. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు మోహరించి ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే విష్ణు బౌనర్స్ కు, మనోజ్ బౌన్సర్లకు మధ్య వివాదం చెలరేగింది. ఇరువురు రాళ్లు రువ్వుకోవటంతో పరిస్థితి అదుపు తప్పింది.
ALSO READ : మంత్రి లోకేష్తో మంచు మనోజ్ భేటీ.. అందుకేనా..?
ఇక తన తాత, నానమ్మ సమాధులను సందర్శించేందుకు కూడా అనుమతి తీసుకోవాలా అంటూ మంచు మనోజ్ ప్రశ్నించారు. అవసరమైతే ఎస్పీ దగ్గర పర్మిషన్ తీసుకుంటానని తెలిపారు. వారి సమాధులను చూడకుండా వెనక్కి వెళ్ళనని, దమ్ముంటే అరెస్టు చేసుకోవాలంటూ సవాలు విసిరారు. ఈ గొడవలతో యూనివర్సిటీ చుట్టుపక్కల వాళ్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇక సమాధుల వద్ద దండం పెట్టుకొని హైదరాబాద్ వెళ్లిపోతానని.. మంచు మనోజ్ స్పష్టం చేసినప్పటికీ వారు అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్న మీడియా సిబ్బందిపై సైతం మంచి ఫ్యామిలీ ఫైర్ అయినట్టు తెలుస్తోంది. జర్నలిస్టుల మైకులు లాక్కొని అక్కడ జరుగుతున్న దృశ్యాలను రికార్డు చేయకుండా ఆపేసినట్టు సమాచారం.
ఉదయమే మోహన్ బాబు వర్సిటీలోకి మంచు మనోజ్ రావడానికి ప్రయత్నించినప్పటికీ అనుమతి లేకపోవడంతో అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఆపై మంచు మనోజ్, మౌనిక దంపతులు రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు చేరుకున్నారు. అక్కడి నుంచి నారా వారి పల్లెకు వెళ్లి మంత్రి నారా లోకేష్ తో భేటి అయ్యారు. అనంతరం రంగంపేటలో ప్రారంభమైన జల్లికట్టు పోటీలకు హాజరయ్యారు. ఆపై మళ్లీ శ్రీవిద్యానికేతన్ యూనివర్సిటీ వద్దకు చేరుకున్నారు. అయితే మంచు మనోజ్ వస్తున్నట్టు ముందస్తు సమాచారం ఉండటంతో యూనివర్సిటీ గేట్లు మూసేసి ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు ఎవరినీ రాకుండా అడ్డుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మీడియా సిబ్బందిని సైతం అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారని.. రికార్డ్ చేస్తున్న జర్నలిస్టుల నుంచి మైకులు సైతం లాక్కునే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.