Mekapati : నెల్లూరు జిల్లా ఉదయగిరిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. మేకపాటి నియోజకవర్గానికి వస్తే తరిమికొడతామని వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి ఇటీవల వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ నేతలు కవ్వింపులకు దిగడంతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సై అన్నారు. ఉదయగిరికి వచ్చారు. తొలుత మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ అధిష్టానంపై మరోసారి విమర్శలు చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నాయకుడిని పార్టీ అధిష్ఠానం అభాండాలు వేసి సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. కొందరు వైసీపీ నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఆదరించడం వల్లే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని స్పష్టం చేశారు. ఎవరొస్తారో రండి.. తరిమికొట్టండి అని సవాల్ విసిరారు.
ఉదయగిరి బస్టాండ్ సెంటర్ లోకి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులతో కలిసివచ్చారు. అక్కడే కుర్చీ వేసుకుని కూర్చున్నారు. గంటన్నరపాటు అక్కడే ఉన్నారు. దీంతో ఉదయగిరిలో ఉద్రిక్తత నెలకొంది. అక్కడికి ఎమ్మెల్యే అనుచరులు భారీగా తరలిరావడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
మేకపాటి అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఉదయగిరి బస్టాండ్ సెంటర్ కు వైసీపీ నేతలు చేరుకున్నారు. మూలే వినయ్ రెడ్డి అనుచరులతో కలిసి అక్కడకి చేరుకోవడంతో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
ఇటీవల ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్రెడ్డి టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారంటూ వైసీపీ అధిష్ఠానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో అప్పటి నుంచి వైసీపీ నేతలు మేకపాటిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో మేకపాటి ఉదయగిరికి వస్తే తరిమికొడతామంటూ ఆయన వ్యతిరేక వర్గం నేతలు హెచ్చరించారు. పార్టీ ద్రోహి మేకపాటి నియోజకవర్గం నుంచి వెళ్లిపో అంటూ ప్లకార్డులతో గురువారం ఉదయం ఉదయగిరిలో ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే బస్టాండ్ సెంటర్ కు చేరుకుని ఎమ్మెల్యే మేకపాటి సవాల్ చేశారు.