Andhra Earthquake: ఆంధ్రప్రదేశ్ లో స్వల్ప భూకంపం సంభవించింది. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణానికి 20 కిలో మీటర్ల దూరంలో ప్రకంపనలు వచ్చాయి. భూమికి 10 కి.మీ లోతులో కదలికలు చోటుచేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ధ్రువీకరించింది. రిక్టర్ స్కేలుపై 3.5గా ప్రకంపనల తీవ్రత నమోదైనట్లు ప్రకటించింది.
గురువారం తెల్లవారుజామున 2:35 గంటల ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వినుకొండతో పాటు దర్శి దాని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ ప్రకంపనలను ఫేస్ చేసినట్లు సమాచారం. ఇంట్లోని వస్తువులు నెమ్మదిగా కదిలిపోవడం చూసి ఆ ప్రాంత వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పలువురు ఇంట్లో నుంచి బయటకు పరుగులు సైతం పెట్టినట్లు తెలిసింది.
వినుకొండలో స్వల్ప భూ ప్రకంపనలు.. సీసీ ఫుటేజ్
CC footage visuals of Minor earthquakes in Vinukonda https://t.co/6h4GXBkhFP pic.twitter.com/qVqq87G6gd
— BIG TV Breaking News (@bigtvtelugu) February 19, 2026
ఇదిలా ఉంటే పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు భూకంప కేంద్రం 46 కి.మీ దూరంలో ఉంది. అక్కడి ప్రజలు సైతం స్వల్ప ప్రకంపనలు గమనించినట్లు తెలుస్తోంది. వినుకొండ, దర్శితో పాటు మాచర్ల, పిడుగురాళ్ల, అద్దంకి, చిలకలూరిపేట, సత్తెనపల్లి ప్రాంతంలోనూ గుర్తించలేని స్థాయిలో అతి చిన్నగా కదలికలు వచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
స్వల్ప భూకంపం కావడంతో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే రాబోయే ఐదు రోజుల్లో మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read: Karnataka Crime: ఐదేళ్ల ప్రేమలో ఏం జరిగింది? ప్రియురాల్ని చంపి ఆపై ప్రియుడు, మరో విషయం ఏంటంటే..
కాగా, గతేడాది నవంబర్ లో విశాఖపట్నంలోనూ ఈ తరహాలో స్వల్ప భూకంపం సంభవించింది. నవంబర్ 4వ తేదీ తెల్లవారుజామున భూమి కంపించగా.. రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. అల్లూరిజిల్లా జీ మాడుగల ప్రాంతంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వైజాగ్ లోని గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలి తదితర ఏరియాల ప్రజలు ఈ భూప్రకంపనలను ఫేస్ చేశారు.