Minister Gudiwada Hot Comments Elections Results 2024: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. అయినా నేతల మాటలు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాము రూలింగ్లోకి వస్తామంటే ఒకరంటే.. కాదు తామే వస్తామని మరొకరు అంటున్నారు. తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాము కోరుకునేది ఒక్కటేనని కేంద్రంలోని ఏ కూటమికీ పూర్తి మెజార్టీ రాకూడదని మనసులోని మాట బయటపెట్టారు మంత్రి అమర్నాథ్. అప్పుడే తాము కింగ్ మేకర్ అవుతామని, తమ పనులు ఈజీగా అవుతాయన్నది తన తాపత్రయంగా చెప్పుకొచ్చారు. కేంద్రంలో ఏ కూటమికీ 200 లేదా 220 సీట్లు కంటే ఎక్కువ రాకూడదన్నారు. అప్పుడే ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరమని, అప్పుడు తామే కీలకమవుతామన్నారు.
ఏ కూటమి మెజార్టీ వచ్చినా తమను పిలవరన్నారు మంత్రి అమర్నాథ్. ఈ లెక్కన కేంద్రంలో ఎవరు వచ్చినా దోస్తీకి కోసం ఆ పార్టీ ఆశపడుతున్నట్టేనన్నమాట. ముఖ్యంగా కాంగ్రెస్లోకి జగన్ వెళ్లరని అంటున్నారు. ఎందుకంటే అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే జగన్ని జైలుకి పంపిందనే వాదనా లేకపోలేదు. ఇకపోతే బీజేపీతో దోస్తీకి ఫ్యాన్ పార్టీ తహతహలాడుతున్నట్లు మంత్రి మాటల్లో అర్థమైంది.
Also Read: అందుకేనా.. ఐ’ప్యాక్’ ఆఫీసుకు సీఎం జగన్
ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ ఇదే వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారాయన. తమ హామీలు నెరవేర్చితే వారికే మద్దతు ఇస్తామంటున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక తొలిసారి ఢిల్లీ వెళ్లిన జగన్, అప్పుడూ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి పూర్తి మెజార్టీ రావడంతో హామీలపై డిమాండ్ చేసే పరిస్థితి లేదని అప్పట్లో అన్నారు. అదే పల్లవిని ఇప్పుడు మంత్రి అమర్నాథ్ ఎత్తుకున్నారు. ఇంతకీ మంత్రి అమర్నాథ్ తన నియోజకవర్గంలో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపినట్టు అన్న చర్చ జోరుగా సాగుతోంది. మాగ్జిమమ్ మంత్రికి ఎదురుగాలి వీస్తుందన్న ప్రచారం లేకపోలేదు.
విశాఖలోనే సీఎం జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పేశారు మంత్రి అమర్నాథ్. భారీగా పోలింగ్ జరిగిందని, మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ కార్యకర్తలు బాగా శ్రమించారని చెప్పుకొచ్చారు. పోలింగ్ శాతం పెరిగిందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువ పడిందనే ప్రచారం చేస్తున్నారని అది ముమ్మాటికీ తప్పుగా వర్ణించారు. కొద్దిరోజులు ఓపిక పడితే అందరి జాతకాలు బయటపడతాయని ప్రత్యర్థి పార్టీల నుంచి కౌంటర్లు అప్పుడే పడిపోతున్నాయి.