Minister Lokesh: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ప్రశాంతి నిలయం ప్రశాంతతకు ఆలయం అన్నారు. సత్యసాయి బాబా చూపిన సన్మార్గంలో ప్రతీ ఒక్కరూ నడవాలని కోరారు. పేదలకు ప్రేమతో సహాయం చేయాలన్న బాబా మాటలే తనకు స్ఫూర్తిగా చెప్పారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలు వద్దని, సత్యం మాట్లాడుదామన్నారు. ఇదే బాబాకు మనం ఇచ్చే ఘన నివాళి అన్నారు. సత్యసాయి భక్తుల తరపున ప్రధాని మోదీకి మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు చెప్పారు.
“సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టం. ప్రశాంతి నిలయం ప్రశాంతతకు ఆలయం, సేవే మన కులం సమానత్వమే మన మతం. సమాజానికి సత్యసాయి ట్రస్ట్ అద్భుతమైన సేవలు చేస్తోంది. ఇక్కడకు నేను వచ్చినప్పుడు బంగారూ అని సత్యసాయిబాబా పిలిచినట్టు అనిపిస్తోంది. మనుషుల్లో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మన మధ్యలోనే ఉంటారు. బాబా శతజయంతి కేవలం ఓ వేడుక కాదు, ఇది లోతైన, దైవిక కృతజ్ఞతా క్షణం. ప్రేమ, సేవ, శాశ్వతమైన విలువల ద్వారా మానవాళిని మార్చిన వందేళ్ల పవిత్ర ప్రయాణం. భగవాన్ సత్యసాయి చెప్పినట్లు.. సేవే కులం, సమానత్వమే మతం. ప్రార్థించే పెదవుల కన్నా సాయంచేసే చేతులు పవిత్రమైనవి. సత్యసాయి చూపించిన మార్గం అందరినీ ప్రేమించు-అందరికీ సేవ చేయి. ఎప్పటికీ సహాయం చేయి- ఎవరినీ బాధించకు. బాబా చూపిన బాటలో మనమంతా నడవాలి. ‘నా జీవితం నా సందేశం’ అని బాబా జీవితాన్ని మనకు పాఠంగా నేర్పారు” అని మంత్రి నారా లోకేష్ అన్నారు.
Also Read: Puttaparthi: విశ్వప్రేమకు ప్రతిరూపం, ఆయన ప్రేమ మనతో, సత్యసాయి జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ