Nara Lokesh Warning: ఏపీలో రాజకీయాలు క్రమంగా హీటెక్కుతున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు వైసీపీ కొత్త అస్త్రాలకు పదును పెడుతోందా? ప్రభుత్వంపై పదే పదే నెగిటివ్ ప్రచారాన్ని తీవ్రతరం చేసిందా? స్వయంగా మంత్రి లోకేష్ వార్నింగ్ ఇచ్చారంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ అసలు విషయం ఏంటి?
సీఎం చంద్రబాబు హామీపై దుష్ప్రచారం
ఏపీలో రాజకీయాలు విచిత్రంగా సాగుతున్నాయి. విపక్ష వైసీపీ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయలేదు. ఆ పార్టీ నేతల అరెస్టు, మావిగన్ తప్పితే మిగతా విషయాలను పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వం పథకాలు, హామీలపై వెరైటీగా ప్రచారం మొదలుపెట్టింది. దీనిపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
మార్చి 30న తిరుపతి జిల్లా నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల ఈవెంట్కి పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఓ మహిళా లబ్ధిదారురాలి ఇంటికి వెళ్లి సత్యనారాయణ స్వామి వ్రతంలో పాలు పంచుకున్నారు. ఆమె భర్త ఆటో డ్రైవర్ అని తెలుసుకున్న ముఖ్యమంత్రి, జీవనోపాధి కోసం ఓ బ్యాటరీ ఆటోను ఇప్పించాలని జిల్లా కలెక్టర్ను అక్కడికక్కడే ఆదేశించారు.
ఖండించిన మంత్రి లోకేష్, చర్యలు తప్పవని హెచ్చరిక
ఆ ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలో ముఖ్యమంత్రి ఎదురుగా ఉన్న మరో ఇంటికి వెళ్లారు. ఒక మహిళ తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని కోరారు. ఈ రెండు విషయాలను కలిపి చదువుకున్న యువకుడికి ఆటో కొనిపెడతారట అంటూ ఎడిట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు ప్రత్యర్థులు.
ఈ విషయం మంత్రి లోకేష్ దృష్టికి వచ్చింది. ఆయా వీడియోలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వీడియోలను తప్పుడు అర్ధం వచ్చేలా ఎడిట్ చేసి ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఇలాంటి ప్రయత్నాలు చేసేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.
ALSO READ: ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండి.. జగన్పై మంత్రి సంధ్యారాణి ఘాటు వ్యాఖ్యలు
ఈ ఒక్క విషయం మాత్రమే కాదు.. గతంలో దీనిపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ద్వారా వివరణ ఇచ్చింది. మళ్లీ అదే అంశంపై దుష్ప్రచారం చేయడం నేరమన్నారు. ఈ వ్యవహారంపై ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ రియాక్ట్ అయ్యారు. ఇలాంటి ప్రచారం చేసినవారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.