AP Assembly Session-2026: ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్స్టాప్ పెట్టాలన్నది తమ ధ్యేయమన్నారు మంత్రి నారా లోకేష్. ఫ్యాక్షన్కు అడ్డుకట్ట వేసి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేకంగా బిల్లు తీసుకొచ్చామన్నారు. ఈ బిల్లు సభలో ప్రవేశపెట్టడం ఇది రెండోసారి. దీనిపై అన్నివిధాలుగా చర్చించిన తర్వాత బిల్లు తీసుకొచ్చామన్నారు.
ఏపీలో ఫ్యాక్షన్ రాజకీయాలకు చెక్
బుధవారం ఏపీ అసెంబ్లీలో ఏపీ పబ్లిక్ సర్వీసు నియామకాల బిల్లు సవరణకు సంబంధించిన బిల్లును మంత్రి లోకేష్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా బిల్లు గురించి ఆయన మాట్లాడారు. గతేడాది సెప్టెంబర్ 27న అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదించి మండలికి పంపామని తెలిపారు. అయితే అక్కడ ఆ బిల్లు ప్రవేశపెట్టలేదన్నారు. 100 రోజులు పూర్తి కావడంతో మళ్లీ బిల్లు అసెంబ్లీకి వచ్చిందన్నారు.
బిల్లు సందర్భంగా కొన్ని విషయాలను ప్రస్తావించారు మంత్రి లోకేష్. 1996లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఫ్యాక్షన్ రాజకీయాలపై ఫుల్స్టాప్ పెట్టాలని భావించారని గుర్తు చేశారు. ఆ తర్వాత 2004 లో వైఎస్ రాజశేఖర్రెడ్డి అధికాంలోకి వచ్చిన తర్వాత 164 మంది టీడీపీ కార్యకర్తలను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలను పరామర్శించి ఇంటికి వెళ్లేలోపు మరో హత్య జరిగేదన్నారు.
మండలిలో ఆపిన వైసీపీ.. అసెంబ్లీలో మళ్లీ బిల్లు పెట్టిన మంత్రి లోకేష్
ఆ విధంగా హత్యలకు గురైన వారి పిల్లలను ఎన్టీఆర్ స్కూల్లో చదివించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఆ పిల్లలు ఫ్యాక్షన్ వైపు వెళ్లకుండా మంచి భవిష్యత్తు ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆనాడే టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. 2019-24 మధ్యలో చాలా హత్యలు జరిగాయని ప్రస్తావించారు సదరు మంత్రి.
బీసీ నాయకుడు తోట చంద్రయ్యను 2022 ఏడాది జనవరి 12న అత్యంత దారుణంగా హత్య చేశారన్నారు. మెడపై కత్తి పెట్టి పార్టీకి జై కొట్టాలని ఆనాటి పాలకులు ఒత్తిడి తెచ్చారని, అందుకు నో చెప్పడంతో అతి కిరాతంగా చంపేశారని చెప్పుకొచ్చారు. వారి అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని పార్టీ పరంగా చర్చించామన్నారు. కూటమి భాగస్వామి పార్టీలతో మాట్లాడామన్నారు. చివరకు కేబినెట్లో దీనిపై చర్చించామని అన్నారు.
ALSO READ: అనకాపల్లిలో 100 కోట్ల భూ దోపిడీ.. ‘కూటమి’ గుట్టు రట్టు చేసిన అమర్నాథ్!
ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్స్టాప్ పెట్టాలంటే.. ఎవరైతే ఆ విధంగా మృతి చెందితే ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే వారి జోలికి వెళ్లేందుకు భయపడతారని భావించి బిల్లు తెచ్చామన్నారు. కావాలనే ఈ బిల్లును మండలిలో తొక్కిపెట్టారన్నారు. ఏపీలో ఏ కుటుంబానికి ఇలాంటి అన్యాయం జరగకూడదన్న ఆలోచనతో మరోసారి తెచ్చామన్నారు. ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా పాస్ చేయాలని కోరారు మంత్రి లోకేష్.