కూటమి అధికారంలోకి వచ్చాక మంత్రులలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన నేత నిమ్మల రామానాయుడు. బుడమేరు వరదల సమయంలో ఆయన బాగా హైలైట్ అయ్యారు. ఆయన చేపట్టిన సహాయక చర్యలు, అర్థరాత్రిళ్లు సైతం జోరువానలో నిలబడి బుడమేరు కట్టను సరిచేయడం కోసం ఆయన చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. అదే సమయంలో అందరికంటే ఎక్కువగా ట్రోలింగ్ కి గురైంది కూడా ఆయనే అని చెప్పాలి. మీకు 15 వేలు, మీకు 15 వేలు అంటూ జగన్ సహా వైసీపీ నేతలంతా నిమ్మల రామానాయుడు వ్యాఖ్యల్ని రిపీట్ చేస్తూ కూటమికి కౌంటర్లిచ్చారు. తల్లికి వందనం అమలు తర్వాత అవే కౌంటర్లు వైసీపీకి రివర్స్ లో తగిలాయనుకోండి. అలాంటి నిమ్మల రామానాయుడు మరోసారి ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన పసుపు చొక్కానే ఆయన్ను టాక్ ఆఫ్ ది స్టేట్ గా మార్చింది.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు గారు, భువనేశ్వరి గారు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. వధూవరులు శ్రీజ, దుర్గా హరిహర సాయి పవన్ కుమార్ లను ఆశీర్వదించారు.#ChandrababuNaidu #NaraLokesh… pic.twitter.com/oyJPAj47Aq
— Telugu Desam Party (@JaiTDP) September 24, 2025
పసుపు చొక్కా నిమ్మల..
మంత్రి నిమ్మల రామానాయుడు అసలు సిసలు పసుపు సైనికుడుగా పార్టీలో గుర్తింపు తెచ్చుకున్నారు. లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తుంటారు, హడావిడి, హంగు ఆర్భాటాలు ఉండవు, నియోజకవర్గంలో ఏ ఇంటికైనా వెళ్లి పేరు పెట్టి వారిని పలకరించేంత చొరవ ఉంది. ఎన్నికలకు ముందు ప్రతి రోజూ తన గ్రామంలో నిత్యాన్నదానం నిర్వహించేవారు. 2014లో తొలిసారి ఆయన పాలకొల్లు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైసీపీ హవాలో కూడా ఆయన టీడీపీ తరపున పాలకొల్లు నుంచి విజయం సాధించారు. 2024లో కూడా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు, ఏకంగా చంద్రబాబు కేబినెట్ లో కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా స్థానం దక్కించుకున్నారు. ఏ పార్టీలో ఆయినా కార్యకర్తలు పార్టీ రంగు ఉన్న చొక్కాలు, టీషర్ట్ లు వేసుకోవడం సహజం. కొంత స్థాయి పెరిగిన తర్వాత వైట్ అండ్ వైట్ లోకి మారిపోతుంటారు. కానీ నిమ్మల రామానాయుడు మంత్రి అయినా కూడా పసుపు చొక్కాకి దూరం కాలేదు. అదే ఆయన ట్రేడ్ మార్క్ గా నిలిచింది. ఎంతలా అంటే సొంత కూతురు పెళ్లిలో కూడా ఆయన పసుపు చొక్కానే వేసుకునేంతలా.
పసుపు సైనికుడు🔥🔥🔥🔥
తన కూతురి వివాహంలో కూడా పసుపు చొక్కా తీయలేదు
మన ఇరిగేషన్ శాఖ మంత్రి @RamanaiduTDP pic.twitter.com/FpufLoFLLq— Rama krishna (@Rk5255) September 24, 2025
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ వివాహ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు దంపతులు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫొటోల్లో పెళ్లి కుమార్తె తండ్రి మంత్రి నిమ్మల పసుపు చొక్కనే ధరించి ఉన్నారు. సహజంగా ఇలాంటి శుభకార్యాక్రమాలప్పుడయినా షేర్వానీ లేదా సూటు బూటు వేసుకుంటారు నాయకులు. కానీ నిమ్మల మాత్రం తన పార్టీపై అభిమానాన్ని పక్కన పెట్టాలనుకోలేదు. అందుకే పసుపు చొక్కానే ధరించి కనపడ్డారు. పార్టీపై నిమ్మల అభిమానాన్ని చూసి సీఎం చంద్రబాబు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారని అంటున్నారు. పెళ్లిలో కూడా పసుపు చొక్కా ఏంటని బంధువులు అడిగినా కూడా ఆయన ససేమిరా అన్నారని, పసుపు చొక్కాయే వేసుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు.
ఫొటోలు వైరల్..
అసలైన పసుపు సైనికుడు మంత్రి నిమ్మల రామానాయుడేనంటూ సోషల్ మీడియాలో ఆయన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు రామానాయుడు పసుపు చొక్కా ధరించిన ఫొటోలను పోస్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. పార్టీపై ఇంత అభిమానం చూపించే నాయకుడు ఇంకెవరున్నారని సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు.