Mudragada says pawan lose: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నేతల మధ్య ఛాలెంజ్ల పర్వం మొదలైంది. తాజాగా వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్కల్యాణ్ ఓటమి ఖాయమన్నారు. ఆయన్ని ఓడించకపోతే తాను పేరు మార్చుకుంటానని శపథం చేశారాయన.
అంతేకాదు పవన్ వ్యవహారశైలిని తీవ్రంగా దుయ్యబట్టారు ముద్రగడ. పవన్ ఎవరినీ దగ్గరకు రానివ్వరని అన్నారు. తన వద్ద పనిచేసే డైరెక్టర్లకు ఏనాడైనా కప్పు కాఫీ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ఎవరి బర్త్డే అయినా వస్తే.. పవన్ ఇంట్లో పది మంది ఉంటే వారందరికీ కేకులతోపాటు భోజనాలు ప్రొడ్యూసర్లే పంపించాలంటూ వ్యాఖ్యలు చేశారు. కేక్ నుంచి తినే తిండి వరకు అన్నీ నిర్మాతే భరించాలని కుండబద్దలు కొట్టేశారు. ఆయనకు మనీ తప్ప, ఇతరులను గౌరవించే గుణం లేదన్నారు.
కష్టమొస్తే ఎవరికైనా ఫోన్ నెంబర్ ఇచ్చారా అని పవన్ను ప్రశ్నించారు ముద్రగడ. ఆయన్ని నమ్ముకుని నాశనమయ్యామని ఆ పార్టీలో ఉన్నవారే చెబుతున్నారని గుర్తు చేశారు. ఏ రైతుకు ఆయన ఎంత ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్కు సినిమాల కంటే రాజకీయాల్లోని ఆదాయమే ఎక్కువని సన్నిహితులే చెబుతున్నారన్నారు. తనను ఉప్మా, కాఫీ అనడానికి సిగ్గులేదా అని దుయ్యబట్టారు. తన దగ్గరకు వచ్చినవారికి మర్యాద చేయాలని తన తండ్రి నేర్పారని, మా ఇంటికి ఎవరు వచ్చినా భోజనం పెట్టి పంపిస్తామన్నారు.
ముద్రగడ వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత కిరణ్ రాయల్ కౌంటరిచ్చారు. పిఠాపురంలో పవన్ను ఓడించడం మీ తరం కాదన్నారు. పద్మనాభం ఇప్పటికే పద్మనాభంరెడ్డిగా మారారని సెటైర్లు వేశారు. మరోసారి పవన్ను విమర్శిస్తే జనసైనికులు ఆయనకు సినిమా చూపిస్తారన్నారు.
ALSO READ: జగన్ వైఎస్సార్ వారసుడా ? లేక కేంద్రానికి వారసుడా ? : షర్మిల ఫైర్
ఇటీవల ఎన్నికల ప్రచారంలోభాగంగా ముద్రగడపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పవన్కల్యాణ్. ఈ క్రమంలో ఆయనపై కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారని అంటున్నారు. అంతేకాదు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ను ఓడించే బాధ్యతను ముద్రగడకు జగన్ అప్పగించారు. ఈ క్రమంలో వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నట్లు నేతలు చర్చించుకోవడం మొదలైంది.