ఎన్డీఏలో చంద్రబాబు చక్రం తిప్పారు, తిప్పుతున్నారు కూడా. టీడీపీలో చంద్రబాబు వారసుడిగా లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే సమయంలో అటు ఎన్డీఏలో కూడా చంద్రబాబుతోపాటు లోకేష్ కి సమాన ప్రాధాన్యత దక్కడం విశేషం. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం లోకేష్ మూడు రోజులపాటు ప్రచారం చేపట్టారు బీహార్ వెళ్లి పాట్నాలో పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల కలిగే ఉపయోగాలని వివరించారు. ఇప్పుడు బీహార్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఆయనకు ఆహ్వానం అందడం విశేషం. చంద్రబాబుతోపాటు లోకేష్ కూడా ఈనెల 20న పాట్నాకు వెళ్తారు.
మోదీకి ఇష్టమైన నేతగా?
ప్రధాని మోదీకి ఏపీలో అత్యంత ఇష్టమైన నేతగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు నారా లోకేష్. రాష్ట్ర మంత్రిగా కాకుండా, కేంద్రంలో పార్టీ తరపున చక్రం తిప్పగల నేతగా ఆయన మోదీ దృష్టిలో పడ్డారు. ఏపీ పర్యటనలకు వచ్చిన సందర్భంలో ఆయన లోకేష్ ని దగ్గరకు తీసుకుంటున్న తీరు చూస్తుంటే ఇది నిజమేనని అర్థమవుతుంది. తాజాగా కర్నూలు మీటింగ్ సందర్భంలో కూడా లోకేష్ ని స్టేజ్ పై పిలిచి మరీ పక్కన నిలబెట్టుకున్నారు ప్రధాని మోదీ. పుస్తకావిష్కరణలో ఆయన్ను భాగస్వామిని చేశారు. ఇటీవల బీహార్ ఎన్నికల సందర్భంగా ఏపీ నుంచి నారా లోకేష్ ని ప్రచార రంగంలోకి దింపారు. ఎన్డీఏ తరపున ఆయన పాట్నాకు వెళ్లి ప్రచారం చేశారు.
సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం..
సహజంగా కూటమి పార్టీలనుంచి ఎవరైనా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే మిగతా పార్టీల నేతలు ఆ కార్యక్రమానికి హాజరవడం ఆనవాయితీ. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం తర్వాత ఈనెల 20 న బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి టీడీపీ తరపున సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. అయితే అనూహ్యంగా చంద్రబాబుతో పాటు లోకేష్ కి కూడా ఈ దఫా ఆహ్వానం అందింది. బీహార్ లో ప్రచారం చేయడం, విజయంలో ఆయన కూడా భాగస్వామి కావడం వల్లే ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మూడు రోజులపాటు అక్కడే మకాం వేసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు నారా లోకేష్. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకటే పార్టీ లేదా కూటమి అధికారంలో ఉంటే కలిగే ప్రయోజనాలను ఆయన వ్యాపారవేత్తలకు వివరించారు. ఏపీని ఉదాహరణగా చూపిస్తూ ఆయన అక్కడ వ్యాపార వర్గాలను మోటివేట్ చేశారు. ఏపీలో పొరపాటున వైసీపీకి ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రం వెనక్కు వెళ్లిపోయిందని చెప్పారు. ఆ తప్పు బీహార్ ప్రజలు చేయకూడదన్నారు. ముఖ్యంగా వ్యాపార వర్గాలు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, తద్వారా అవకాశాలను వారు అందిపుచ్చుకోవాలని సూచించారు.
లోకేష్ అభిమానుల్లో సంతోషం..
ఎన్డీఏలో లోకేష్ కీలకంగా మారుతున్నందున లోకేష్ అభిమానులు, పలువురు టీడీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సుని కూడా యువనేత అన్నీ తానై నిర్వహించారని గుర్తు చేసుకుంటున్నారు.
Also Read: అన్నదాత సుఖీభవ.. కీలక అప్ డేట్