రప్పా, రప్పా.. రెండ్రోజులుగా ఏపీ రాజకీయాల్లో, మీడియాలో, సోషల్ మీడియాలో ఈ డైలాగులే రిపీట్ అవుతున్నాయి. రప్ప రప్ప అంటూ రాజకీయ నాయకులు కాస్త వెటకారంగా స్పందించినా ఇదీ చాలా సీరియస్ విషయం. మా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యర్థుల్ని నరుకుతాం అంటూ ఒక కార్యకర్త ప్లకార్డ్ పట్టుకుని రోడ్డుపైకి వచ్చాడంటే కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. దాన్ని తేలిగ్గా కొట్టిపారేస్తూ అందులో తప్పేముంది అన్న జగన్ మాటతీరుని కచ్చితంగా ఆక్షేపించాల్సిందే. కార్యకర్త ప్లకార్డ్ పట్టుకోవడం వల్ల ఆ వ్యవహారం కొద్దిమందికి మాత్రమే తెలిసే అవకాశముంది. కానీ దాన్ని ఓ పెద్ద ఘనత అన్నట్టుగా వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా వైరల్ చేశాయి. తమ దమ్మేంటో చూడండి అన్నట్టుగా రచ్చ చేశాయి. పోనీ ఆ తర్వాతయినా జగన్ ఆ వ్యవహారాన్ని ఖండించారా అంటే అదీ లేదు. ఆ డైలాగ్ సినిమాలో ఉందని, దాన్ని కూడా తప్పుబడితే ఎలా అంటూ చెత్త లాజిక్ తీశారని మండిపడుతున్నారు నెటిజన్లు.
I said one generation got destroyed because of Ys jagan
REASON 👇never ever encourage this criminal party pic.twitter.com/KV8DOcOqMr
— prudhvi actor (@ursprudhviraj06) June 18, 2025
భావోద్వేగాలతో ఆటలు..
సోషల్ మీడియా బాగా పాపులర్ అయిన తర్వాత సామాన్యుల్లో ఆవేశాలు, భావోద్వేగాలు ఏవీ పరిమితికి లోబడి ఉండట్లేదు. తాము చేస్తున్న పని గొప్పది అని అనుకోవడంతోపాటు, ఆ గొప్పదనాన్ని పదిమందీ చూడాలనుకోవడంతోనే అసలు సమస్య మొదలవుతోంది. చంద్రబాబు పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ ప్లకార్డ్ లు పట్టుకోవడం, టీడీపీ ర్యాలీల్లో జై జగన్ అని నినాదాలు చేయడం ఈ కోవలోనివే. సెన్సేషన్ కోసం కొందరు ఏదయినా చేస్తుంటారు. అయితే అలాంటివారు ఎక్కువగా వైసీపీలోనే ఉండటం విశేషం అంటున్నారు నెటిజన్లు. 2024 ఎన్నికల సమయంలో సిద్ధం అంటూ జగన్ చేపట్టిన యాత్రల్లో ఎంత డ్రామా నడిచిందో అందరికీ తెలుసు. మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో జగన్ చుట్టూ గుమికూడేవారు. కాళ్లకు చెప్పులు లేకుండా మహిళలు ఎర్రటి ఎండలో రోడ్డుపైకి వచ్చి జగన్ కోసం వేచి చూసేవారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో, మీడియాలో చూసేవాళ్లు ఏమనుకుంటారు..? అబ్బ జగన్ కి ఏంటి ఇంత ఆదరణ, ఆయనపై ప్రజల్లో ఏంటి ఈ ఆరాధన అనుకునే ఉంటారు. కానీ ఎన్నికల ఫలితాలు ఏం చెప్పాయి..? 11 సీట్లకు వైసీపీ పరిమితమైంది అంటే కారణం ఏంటి..? ప్రచారం ఎక్కువ, ఫలితం తక్కువ అని అర్థమైంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. జగన్ ఎక్కడ కనపడినా సీఎం సీఎం అంటూ రచ్చ చేస్తున్నారు కార్యకర్తలు. వీరందరికీ జగన్ సీఎం కాదు అనే విషయం తెలియదా. మరో నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేవు అనే విషయం తెలియదా..? అయినా ఎందుకీ గొడవ. జగన్ ని ఇంకా ఎందుకు భ్రమలో ఉంచాలనుకుంటున్నారు. జగన్ పర్యటనల్లో కూడా ఇదే జరుగుతోంది. ఆ జనాన్ని చూసి కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం తమదేనంటున్నారు జగన్. 2024లో వైనాట్ 175 అన్న విషయం జగన్ కి గుర్తులేదా..? అప్పుడు ఏ నమ్మకంతో ఆ డైలాగ్ చెప్పారు, ఇప్పుడు ఏ నమ్మకంతో గెలుపు వైసీపీదేనంటున్నారు..?
ఆ కుర్రాడిని ప్రోత్సహిస్తారా..?
ఇక అసలు విషయానికొద్దాం. రప్ప రప్ప నరుకుతాం అంటూ ప్లకార్డ్ చేతబట్టిన కార్యకర్త వయసెంత..? నరకడం ఏంటి..? నరికితే ఎవరైనా చూస్తూ ఊరుకుంటారా..? పోలీసులు వదిలేస్తారా..? జైలుకెళ్తే భవిష్యత్ ఏంటి..? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి..? ఇవన్నీ తెలిసే ఆ ప్లకార్డ్ పట్టుకున్నాడా అంటే అనుమానమే. పోలీసులు ఇప్పుడు కేసు నమోదైంది కాబట్టి కచ్చితంగా ఈ విషయాలన్నీ అతనికి అర్థమై ఉంటాయి. ఏ నాయకుడి అండతో, ఏ నాయకుడి కోసం ఆ ప్లకార్డ్ పట్టుకున్నాడో అలా చేయడం వల్ల ఏంజరుగుతోందో అనే విషయంలో ఇప్పుడు అతనికి ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది.
వారందర్నీ సమర్థిస్తారా..?
రప్పా రప్పా నరుకుతాం అంటే సంతోషమే కదా అంటున్న జగన్.. మైండ్ సెట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని చంద్రబాబు అన్నారు. ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టిన టీడీపీ నేతలంతా జగన్ తీరుని తీవ్రంగా తప్పుబట్టారు. క్రిమినల్ పార్టీని నడుపుతున్నారంటూ మండిపడ్డారు. అసలు ఈ తరానికి జగన్ ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. మొన్న గంజాయి బ్యాచ్ ని జైల్లో వేస్తే కుటుంబాలను పరామర్శించడానికి జగన్ వచ్చారని, నిన్న అమరావతి మహిళల గురించి జుగుప్సాకరంగా మాట్లాడిన జర్నలిస్ట్ కి అండగా నిలిచారని, ఈరోజు రప్ప రప్ప నరుకుతాం అనే మాటల్ని కూడా సమర్థించారని.. ఇలా క్రిమినల్ యాక్టివిటీస్ ని సమర్థించడం జగన్ కే చెల్లిందని అంటున్నారు.
బాబు, జగన్.. అదే తేడా..?
ఆమధ్య టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఒకరు.. జగన్ సతీమణిపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన వ్యాఖ్యల్ని టీడీపీ నేతలెవరూ సమర్థించలేదు సరికదా, తప్పు చేస్తే ఎవరైనా ఒకటేనంటూ సొంత పార్టీ కార్యకర్తలకే బుద్ధి చెప్పారు. మరిప్పుడు జగన్ చేస్తున్నదేంటి..? తప్పు చేసినవారిని వెనకేసుకు వస్తున్నారు. అంటే అలాంటి తప్పు ఇంకొకరు చేసేందుకు స్వయంగా జగనే ప్రోత్సాహిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి ప్లకార్డులు పట్టుకుంటే తమకి కూడా పలుకుబడి వస్తుందని అమాయక యువకులు ప్రయత్నిస్తే పరిస్థితి ఏంటి..? సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. సామాన్యులు, తటస్థులు జగన్ చర్యల్ని, సమర్థింపుల్ని తప్పుబడుతున్నారు. ఈ విషయంలో జగన్ పునరాలోచించుకోవడం మంచిదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే, నాలుగేళ్ల తర్వాత అధికారం తమదేననే భ్రమల్లో ఉంటే.. 2024 ఫలితాలు రిపీట్ అవ్వడం ఖాయం అని అంటున్నారు.