Big Stories

Palnadu : నకిలీ విత్తనాలతో నష్టపోయిన పల్నాడు రైతులు..

Palnadu : దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. రైతన్నలను ఆదుకోడానికే మా ప్రభుత్వం అంటూ ప్రతి పార్టీ హామీల వర్షం కురిపిస్తుంది. బడుగుల ఓట్లతో గద్దెనెక్కి.. ఆ తర్వాత ఆడిన మాటలు తప్పుతుంది. దశాబ్దాలుగా మన దేశంలో జరుగుతున్న తంతు ఇదే. రైతన్నల వ్యథలను చూపిస్తూ సినిమాలు తీస్తే ఆ కథ హిట్… కానీ రైతన్నల జీవితాలు మాత్రం అట్టర్ ఫ్లాప్. ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల బతుకులు మాత్రం మారడం లేదు. నాణ్యమైన విత్తనాలు దొరకవు… మందు సంచులు దొరకవు… ఏ పంట వేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై తగిన సూచనలు ఉండవు. ఈ పరిస్థితుల్లో అన్నదాతలు ఏం చేయాలి.

- Advertisement -

నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మే వారిపై ఉక్కుపాదం మోపుతాం.. దోషులపై పీడీ యాక్ట్ పెడతాం అంటున్నారు ప్రజా ప్రతినిధులు. మరి నిజంగా వారు చెప్పిన మాటలు అమలైతే.. ప్రతి ఏటా నకిలీ విత్తనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ప్రతిసారి లాగే ఈ ఏడాది కూడా.. పల్నాడు జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతులు నకిలీ విత్తనాలకు బలయ్యారు. పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం తాళ్లచెరువు గ్రామంలో నకిలీ విత్తనాలు సాగు చేసి రైతులు నిండా మునిగారు.

- Advertisement -

ఇదిగో మీరు చూస్తున్న ఈ పత్తి పంట డీలర్ చెప్పిన అధిక దిగుబడి ఇచ్చే విత్తనం గంగా కావేరి సూపర్ సిక్సర్. నాలుగు అడుగుల ఎత్తులో ఏపుగా పెరిగిన ఈ పత్తి మొక్క సిరులు కురిపిస్తుందని ఆశిస్తే చివరికి రైతుల కంట కన్నీళ్లను కురిపిస్తోంది. సహజంగా ఇంత ఎత్తు పెరిగిన పత్తి మొక్క 80 కి పైగా పత్తి కాయల బరువుతో వంగిపోతుంది. కానీ ఈ సూపర్ సిక్సర్ విత్తనం మొక్క మాత్రం నిటారుగా నిల్చోవడంతో అసలు విషయం బయట పడింది. తాను వేసింది నకిలీ విత్తనమని తెలిసే సరికి రైతన్న అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఈ గంగా కావేరి సూపర్ సిక్సర్ విత్తనం మొదట నుండి తేడాగానే పెరుగుతూ వచ్చింది. తేనె బంక, దోమలు, పురుగు పడుతూ ఎన్ని ముందులు కొట్టినా ఉపయోగం లేకుండా పోయింది. ఒక్కో చెట్టుకు కేవలం 15 కాయలే వచ్చి… పత్తి కూడా ఏ మాత్రం నాణ్యత లేకుండా ఉండడంతో పంటను చేను మీదే వదిలేస్తున్నారు రైతులు.

పత్తి పంట నాణ్యమైన విత్తనంతో సాగుచేస్తే ఎకరానికి 10 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎకరానికి పెట్టుబడి 70వేల వరకు అవుతుంది. కానీ ఈ గంగా కావేరి సూపర్ సిక్సర్ విత్తనానికి ఒక క్వింటా కూడా దిగుబడి రాలేదు. కనీసం పత్తి ఏరిన కూలీల ఖర్చు కూడా రాలేదని వాపోతున్నారు రైతులు.

సొంతగా పొలం ఉన్న రైతులే అప్పుల బాధను తట్టుకోలేకపోతుంటే.. ఇక కౌలుకు తీసుకుని పంట సాగు చేసిన రైతుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. భార్యల తాళిబొట్లను సైతం తాకట్టు పెట్టి… పత్తి పంట పండిస్తే.. ఇప్పుడు చేతికి చిల్లిగవ్వ కూడా రాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదేంటని అడిగితే సమాధానం చెప్పే నాథుడే కరువయ్యాడు. పైగా అధికార పార్టీ నేతల అండదండలతో… డీలర్లే కొన్ని సందర్భాల్లో ఎదురుదాడికి దిగుతున్నారు.

వ్యవసాయమే రైతులకు శాపంగా మారిన దారుణ పరిస్థితులు నెలకొనడం అందరినీ కలచివేస్తోంది. ఇకకైనా పార్టీలు ప్రభుత్వాలు నకిలీ విత్తనాలు అమ్మేవారికి వంత పాడకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిగ్ టీవీ కోరుకుంటోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News