PM Modi Vishaka Tour : విశాఖ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. శనివారం బిజీబిజీగా గడపనున్నారు. విశాఖలో వేల కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివ్రుద్ది పనులకు శంకుస్థాపలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే బహిరంగ సభలోనూ మోడీ పాల్గొంటారు. ఐఎన్ఎస్ చోళలో బస చేసిన మోడీ.. శనివారం ఉదయం 10.10 నిమిషాలకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ బహిరంగ సభలో ప్రధాని మోడీతో పాటు గవర్నర్, సీఎం జగన్, ఇతర బీజేపీ నేతలు కూడా పాల్గొననున్నారు.
పార్టీలకు అతీతంగా జరగనున్న ఈ సమావేశాన్ని ఇటు వైసీపీ, అటు బీజేపీ ప్రతీష్టాత్మకంగా తీసుకున్నాయి. సభకు వేలాదిగా ప్రజలను తరలించనున్నారు. ఈ సభా వేదికగానే పలు ప్రాజెక్టులకు మోడీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. 400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వేస్టేషన్ నవీకరణ, ఈస్ట్కోస్టు జోన్ పరిపాలన భవన సముదాయానికి శంకుస్థాపన, 260 కోట్లతో చేపట్టిన వడ్లపూడిలో వ్యాగన్ వర్క్ షాపు, హెచ్పీసీఎల్ నవీకరణ, విస్తరణ పనులు, 445 కోట్లతో చేపట్టిన ఐఐఎం పరిపాలన భవనానికి ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 152 కోట్లతో చేపట్టనున్న చేపలరేవు నవీకరణ ప్రాజెక్టు, 560 కోట్ల ఖర్చుతో కాన్వెంట్ కూడలి నుంచి షీలానగర్ వరకు పోర్టు రహదారికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తాయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన దృష్ట్యా విశాఖ నగరాన్ని పోలీసులు దిగ్బంధం చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, ఉద్యోగులు నిరసనలను ఉద్ధృతం చేసారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కూర్మన్నపాలెం జంక్షన్లో ఉక్కు కార్మికులు నిరసన తెలుపుతున్నారు.
సేవ్ వైజాగ్ స్టీల్, విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ నిరసనలో ఉద్యోగులతో పాటు కుటుంబసభ్యులు సైతం పాల్గొననున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. విశాఖలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసారు పోలీసులు. మోడీ వెళ్లే ప్రదేశంలో నిరసనకారులు అడ్డుపడకుండా జాగ్రత్త పడుతున్నారు.
విశాఖ పర్యటన అనంతరం.. మధ్యాహ్నం 12.25 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ తెలంగాణకు బయల్దేరుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టులో దిగుతారు. అనంతరం బీజేపీ స్వాగత సభలో పాల్గొంటారు. 1. 40 గంటల నుంచి 2 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 2.10 గంటలకు తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోదీ చేరుకుంటారు.
2.15 గంటలకు MI-17 హెలీక్యాప్టర్లో రామగుండం బయల్దేరి వెళ్తారు. మధ్యాహ్నం 3.20 గంటల సమయంలో రామగుండం ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు. 03.25 గంటలకు హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి.. 03.30 గంటలకు రామగుండం RFCL ప్లాంట్కు చేరుకుంటారు. అక్కడ రామగుండం ఎరువుల కార్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు.