AP Politics : పరిటాల ఫ్యామిలీ. పరిచయం అవసరం లేని కుటుంబం. సీమలో పవర్ఫుల్. టీడీపీలో కీలకం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాడులను ఎదుర్కొంటారు. అధికారంలోకి వచ్చాక శాంతంగా ఉంటారు. పౌరుషం, ప్రతీకారం, ఫ్యాక్షనిజం.. అదంతా పరిటాల రవి హయాంలో. ఇప్పుడు సునీత, శ్రీరామ్లు కామ్గా తమ రాజకీయాలు తాము చేసుకుంటున్నారు. అలాగని, సింహం నిద్రపోతోంది కదాని దానితో సెల్ఫీ తీసుకుందామంటే డేంజర్. అదే హెచ్చరిస్తున్నారు ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్.
ఒరిజినల్ అలానే ఉందంటూ..
ధర్మవరం మినీ మహానాడు సందర్భంగా పరిటాల శ్రీరామ్ సంచలన కామెంట్స్ చేశారు. తాను ధర్మవరం ఇంఛార్జిగా వచ్చిన తర్వాత చాలా మారిపోయానని.. ఈ ప్రాంతం తనకు చాలా ఓపిక ఇచ్చిందన్నారు. కానీ, లోపల ఇంకా ఒరిజినల్ అలానే ఉందంటూ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు, అర చేయి కూడా ఆయుధంగా మారుతుందన్నారు.
పరిటాల వార్నింగ్ ఎవరికి?
నాయకుడంటే పదిమందిని ముందుకు నడిపించేవాడే కానీ.. పది మందిని వెంటేసుకునే వాడు కాదన్నారు పరిటాల శ్రీరామ్. అలా ఉంటే చచ్చిన శవంతో సమానమని.. శవం లాగా ఉండడానికి మనం సామాన్య వ్యక్తులం కాదన్నారు. పరిటాల రవి స్పూర్తిగా.. పరిటాల రవి కొడుకుగా తాను ధర్మవరానికి వచ్చానని.. మీరేం చేసినా మీ వెంట నేను ఉంటా అంటూ కేడర్కు ధైర్యం నూరిపోశారు. పరిటాల వ్యాఖ్యలు టీడీపీలో కాక రేపుతున్నాయి. శ్రీరామ్ వార్నింగ్ ఎవరికి అంటూ చర్చ జరుగుతోంది. తోపుదుర్తికా? సొంత పార్టీ నేతకా? లేదంటే…!!
సునీత కామెంట్స్
శ్రీరామ్ కామెంట్స్ కాక రేపుతున్న సమయంలోనే పరిటాల సునీత సైతం జిల్లా మహానాడులో అదే డోస్లో మాట్లాడారు. ఎంతో మందికి రాజకీయ బిక్ష పెట్టిన పార్టీ టీడీపీ అని.. గత ఐదేళ్లు కార్యకర్తలు కష్టపడ్డారని చెప్పుకొచ్చారు. ఒక్కొక్కరిపై 20, 30 కేసులు పెట్టారని అన్నారు. కొందరు పోలీసులు ఇంకా అదే ముసుగు వేసుకుని టీడీపీ కార్యకర్తలపైనే కేసు పెడుతున్నారని మండిపడ్డారు. కొందరు అధికారులు వైసీపీ కండువా కప్పుకొని పని చేస్తున్నారని విమర్శించారు.
టీడీపీలో కలకలం
జాకీ పరిశ్రమ ఓ దుర్మార్గుడి నిర్వాకం వల్ల వెనక్కి వెళ్లిపోయిందన్నారు సునీత. కార్యకర్తల్లో మరింత ఉత్సహం వచ్చేలా భవిష్యత్తులో పని చేస్తామని చెప్పారు. చంద్రబాబు మాట కోసం పరిటాల శ్రీరామ్ ధర్మవరం ఇంచార్జిగా కొనసాగుతున్నారని అన్నారు. ఇలా, తల్లి, కొడుకులు ఇద్దరూ వార్నింగ్ టోన్తోనే మాట్లాడటం జిల్లాలో, టీడీపీలో హాట్ టాపిక్గా మారింది.