TDP : సీమలో మళ్లీ రక్తచరిత్ర మొదలైందా? ఫ్యాక్షన్ బూతం మళ్లీ బుసలు కొడుతోందా? వరుస ఘటనలు దేనికి సంకేతం? పోలీసులపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి దౌర్జన్యం.. పాపిరెడ్డిపల్లిలో వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్య.. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికంటూ జగన్ ఓదార్పు యాత్ర.. నేతల మధ్య మాటల యుద్ధం.. అన్నీ కలిపి చూస్తే సీమలో ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు మళ్లీ చెలరేగుతున్నాయనే అంటున్నారు.
సీమలో జగన్ మార్క్ పాలిటిక్స్
ఓడిపోయాక ఇన్నాళ్లూ సైలెంట్గా ఉన్న తోపుదుర్తి బ్రదర్స్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈసారి మరింత దూకుడు మీదున్నారు. రామగిరి ఎంపీపీ ఎన్నిక టీడీపీ, వైసీపీల మధ్య అగ్గి రాజేసింది. పరిటాల వర్సెస్ తోపుదుర్తి సై అంటే సై అంటున్నారు. ఇంతటి రాజకీయ వేడిలో పాపిరెడ్డిపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్త లింగమయ్య హత్యకు గురికావడంతో మరింత ఉద్రిక్తత తలెత్తింది. స్థానిక గొడవలో జగన్ సైతం ఎంట్రీ కావడంతో.. పరిటాల సునీత కస్సుమంటున్నారు. ప్రశాంతంగా ఉన్న అనంతలో కావాలనే మళ్లీ ఫ్యాక్షన్ను రెచ్చగొడుతున్నారని మండిపడుతున్నారు.
ఆ బాంబులు ఎవరికి పని?
తన భర్త పరిటాల రవి హత్యలో జగన్కి కూడా పాత్ర ఉందని.. ఆరోజు సీబీఐ జగన్ని కూడా విచారించిందని సునీత అన్నారు. టీవీ బాంబు గురించి మాట్లాడుతున్న వారు.. కారు బాంబు గురించి కూడా మాట్లాడాలి.. సూట్ కేస్ బాంబు ఎవరు పెట్టారో చెప్పాలంటూ తోపుదుర్తిని టార్గెట్ చేశారు. తోపుదుర్తి సోదరులు తమ స్వార్థం కోసం ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొడుతూ.. ఓబుల్రెడ్డి, మద్దలచెరువు సూరి కుటుంబాలను ఇందులోకి లాగుతున్నారని ఆరోపించారు.
జగన్కు శుక్రవారం.. లక్కీ డే?
జగన్కి శుక్రవారం కలిసి వచ్చినట్టుంది.. అందుకే శుక్రవారం రోజు పాపిరెడ్డిపల్లికి వస్తానంటున్నారని సునీత సెటైర్లు వేశారు. తోపుదుర్తి బ్రదర్స్ వల్ల ఐదేళ్లలో వైసీపీ వారు చాలామంది నష్టపోయారని.. జగన్ వారిని కూడా పరామర్శిస్తే బాగుంటుందన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో జగన్ వచ్చి ఫ్యాక్షన్ రగిలించవద్దని సూచించారు. తోపుదుర్తి సోదరులు ఏది చెబితే అదే జగన్ మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. ప్రకాశ్ రెడ్డి పెట్టిన అమ్మ డైరీలో మోసపోయిన వారిని కూడ జగన్ పరమర్శించాలన్నారు సునీత.
రగులుుతన్న రామగిరి రచ్చ
రామగిరిలో చేతగాని దద్దమ్మ ఉన్నాడు కాబట్టే ఎంపీపీ గెలవలేక పోయారన్నారు పరిటాల సునీత. ఎంపీపీ ఎన్నిక విషయంలో తాను జోక్యం చేసుకోలేదని.. అలా చేసుకొని ఉంటే కచ్చితంగా రామగిరి ఎంపీపీ టీడీపీ వశం అయ్యేదని చెప్పారు. వారి ఎంపీటీసీల మీద నమ్మకం లేకనే క్యాంపులకు తరలించారన్నారు. తోపుదుర్తి సోదరులు కొడవళ్లు, మారణాయుధాలు పెట్టి.. రామగిరికి వారి అనుచరులను పంపించారని.. ఓ బీసీ ఎస్సైపై తోపుదుర్తి దౌర్జన్యం చేశాడని సునీత మండిపడ్డారు. తోపుదుర్తి బ్రదర్స్ ఇన్నాళ్లూ చంద్రబాబు, లోకేశ్లపై నోరు పారేసుకుని.. ఇప్పుడు కేసుల భయంతో గౌరవంగా మాట్లాడుతున్నారని తప్పుబట్టారు.
Also Read : నాగబాబు విత్ చంద్రబాబు.. ఏంటి సంగతి?
మళ్లీ ఫ్యాక్షన్ వద్దు..
ఈ సందర్భంగా తోపుదుర్తి కుటుంబం మాయలో పడి మళ్లీ ఫ్యాక్షన్ జోలికి వెళ్లొద్దంటూ గంగుల భానుమతి, కనుముక్కల ఉమాకు పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. ఫ్యాక్షన్ కారణంగా మన మూడు కుటుంబాలు నష్టపోయాయని.. దాని నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీమ ప్రశాంతంగా ఉన్న సమయంలో తోపుదుర్తి సోదరులు మళ్లీ ఇందులోకి లాగుతున్నారని.. ఫ్యాక్షన్ ని రెచ్చగొట్టి చలి కాచుకోవాలని చూస్తున్నారని అన్నారు. వారి మాటలు నమ్మి ఈ కుట్రలో భాగస్వామ్యం కావొద్దని గంగుల, కనుముక్కలకు పిలుపు ఇచ్చారు పరిటాల సునీత.