Pawan Kalyan: మత్తుపదార్థాల వినియోగం కేవలం ఒక వ్యక్తిగత సమస్య మాత్రమే కాదని.. అది కుటుంబాలను విచ్ఛిన్నం చేసే ఒక తీవ్రమైన సామాజిక సవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అంతర్జాతీయ మత్తుపదార్థాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చారు. మత్తు రహిత సమాజాన్ని నిర్మించేందుకు జరిగే అన్ని సామూహిక ప్రయత్నాలకు తన మద్దతు ఉంటుందని పవన్ స్పష్టం చేశారు.
యువతరానికి అపారమైన సామర్థ్యం, గొప్ప భవిష్యత్తు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. యువతలోని ఈ సృజనాత్మక శక్తిని, ఉత్సాహాన్ని.. చదువు, క్రీడలు, సాంస్కృతిక విలువలు, నైపుణ్యాభివృద్ధి వైపు మళ్లించాలని పవన్ సూచించారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని, ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నింపేలా అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత తమపై కూడా ఉందని అన్నారు.
మత్తుపదార్థాల మహమ్మారిపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, అక్రమ రవాణాను ఉక్కుపాదంతో అణచివేయడానికి ఏపీలోని కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. బాధితులకు పునరావాసం కల్పించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామన్నారు. అయితే కేవలం ప్రభుత్వ చర్యల వల్లే కాకుండా సమాజం అంతా ఏకతాటిపైకి వచ్చినప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని పవన్ అభిప్రాయపడ్డారు.
Also Read: కేతన్ కేసులో బిగ్ ట్విస్ట్.. కాబోయే భార్య కావాలని చంపలేదా? ప్రియుడే బెదిరించాడా?
డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో కుటుంబం, విద్యాసంస్థల పాత్రను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్లో వచ్చే మార్పులను, ముందస్తు ప్రమాదాలను గుర్తించాలన్నారు. అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ ముప్పును అందరం కలిసికట్టుగా ఎదుర్కొని.. యువతను కాపాడటానికి సమైక్యంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన, సాధికార పౌరులుగా యువత ఎదిగేలా చేద్దామని ఎక్స్ వేదికగా రాసుకోచ్చారు.
Also Read: వర్షంలో ఫోన్ తీసుకెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకో మామ.. లేదంటే మెుబైల్ మటాషే!