భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజు రోజుకూ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బైక్ లకు యువత నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో జూలై 2026లో పలు కొత్త ఎలక్ట్రిక్ బైక్లు భారత మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. వీటిలో అల్ట్రావయోలెట్, రివోల్ట్ లాంటి ప్రముఖ కంపెనీల మోడళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఈ నెలలో బాగా ఆసక్తి కలిగిస్తున్న బైక్ అల్ట్రావయోలెట్ షాక్ వేవ్. పర్ఫార్మెన్స్ ను ఇష్టపడే రైడర్ల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ఈ బైక్ లో న్యూ జెనరేషన్ బ్యాటరీ టెక్నాలజీ, స్పోర్టీ డిజైన్, మెరుగైన రేంజ్ ఉండే అవకాశం ఉంది. కంపెనీ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించకపోయినా, దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.1.75 లక్షల వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరోవైపు, ఎలక్ట్రిక్ బైక్ల విభాగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రివోల్ట్ మోటార్స్ కూడా కొత్త మోడల్ను తీసుకురావడానికి సిద్ధమైంది. ఇప్పటికే RV400 BRZ మోడల్ తో మంచి విజయాన్ని అందుకున్న కంపెనీ, ఇప్పుడు మరో కొత్త EV బైక్ ను జూలైలో విడుదల చేయనుంది. ఈ బైక్ ధర దాదాపు రూ.1.45 లక్షలుగా ఉండొచ్చని సమాచారం. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువుగా, తక్కువ ఖర్చుతో ప్రయాణించేలా దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది.
అవోర్ ఎలక్ట్రిక్ బైక్ కూడా జూలైలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తున్న కమ్యూటర్ ఎలక్ట్రిక్ బైక్. మంచి రేంజ్, సరసమైన ధర, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు దీని ప్రధాన ఆకర్షణలుగా ఉండనున్నాయి. దీని ధర సుమారు రూ.1.50 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.
అటు ఇండియన్ టూ వీలర్ మార్కెట్ లో టాప్ లో ఉన్న ఏథర్ ఎనర్జీ, రాయల్ ఎన్ఫీల్డ్ కూడా తమ కొత్త ఎలక్ట్రిక్ ప్లాట్ ఫారమ్లపై పని చేస్తున్నాయి. ఈ కంపెనీలు 2026 చివర్లో, వచ్చే ఏడాది ప్రారంభంలో తమ కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ ను మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి రానున్న ఫ్లయింగ్ ఫ్లీ ఎలక్ట్రిక్ బైక్పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఏథర్ కూడా కుటుంబ అవసరాలకు అనుగుణంగా కొత్త EV ప్లాట్ ఫారమ్ను అభివృద్ధి చేస్తోంది. జూలై 2026 భారత ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్కు కీలకమైన నెలగా మారబోతోంది. కొత్త టెక్నాలజీ, మెరుగైన రేంజ్, ఆకర్షణీయమైన డిజైన్లతో రానున్న ఈ మోడళ్లు వినియోగదారులకు మరింతగా ఆకట్టుకోనున్నాయి.
Read Also: డుకాటి To టీవీఎస్.. జూలైలో కొత్త బైక్ల జాతర!