Pawan Kalyan: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొబ్బరి రైతులకు ఇచ్చిన మాటను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు మంగళవారం ఆయన శ్రీకారం చుట్టారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో పవన్ కళ్యాణ్ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును రూ. 20.77 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు.
గతంలో రాజోలు పర్యటనకు వెళ్లిన సమయంలో అక్కడి రైతులు డ్రెయిన్ సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల కష్టాలను చూసి చలించిన ఆయన, 45 రోజుల్లోగా శంకరగుప్తం డ్రెయిన్ సమస్యను పరిష్కరిస్తానని బహిరంగంగా హామీ ఇచ్చారు. అన్న మాట ప్రకారం, గడువు కంటే ముందే.. అంటే కేవలం 35 రోజుల్లోపే సమస్యకు పరిష్కారం చూపడం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో నిధులు మంజూరై పనులు ప్రారంభం కావడంతో కోనసీమ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వర్చువల్గా పాల్గొన్నారు. ఇక క్షేత్రస్థాయిలో శంకరగుప్తంలో జరిగిన కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, జల వనరుల శాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు.
Read Also: Vijayawada News: అరెస్టు భయం.. అజ్ఞాతంలోకి వైసీపీ నేత వల్లభనేని వంశీ, మళ్లీ ఏమైంది?