Pawan Kalyan: తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా 3050 కోట్ల రూపాయలతో అమరజీవి జలధార పథకానికి పవన్ శంకుస్థాపన చేశారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని 23 నియోజకవర్గాల్లో సుమారు 67.82 లక్షల మందికి రెండేళ్లలో ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందనుంది. డిప్యూటీ సీఎంతో పాటు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలి అని ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరుని ఒక్క నెల్లూరుకు పెట్టి జిల్లాకు పరిమితం చేసి ఆయన గౌరవం పెంచామా తగ్గించామా? అని పవన్ ప్రశ్నించారు. ఒకసారి పొట్టి శ్రీరాములు గారి జయంతి నాడు విగ్రహానికి దండ వేసి నివాళులు అర్పిద్దాం అంటే ఆయన విగ్రహం ఎక్కడా లేదన్నారు. ఎక్కడో ఒక ఆర్యవైశ్య సత్రం దగ్గర ఉందని, అక్కడికి వెళ్లాలి అన్నారు, అక్కడ పెట్టడం ఏంటి అంటే ఆయన ఆర్య వైశ్య కులానికి చెందిన వారు అందుకే అక్కడే ఉంటాయి అన్నారు. ఒక గొప్ప నాయకుడిని ఒక కులానికి పరిమితం చేస్తారా? అని ఆ రోజు తనకి అనిపించిందన్నారు. ఒక్క కులం కోసం కాదే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేస్తే మనం ఇచ్చిన గౌరవం ఇదా! అన్నారు.
“అమరజీవి జలధార ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం.
ప్రత్యేకించి “అమరజీవి” జలధార అని పెట్టడానికి కారణం ఉంది. నాకు చాలా ఇష్టమైన నాయకులు మన తెలుగునాట బూర్గుల రామకృష్ణారావు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా పని చేసి తెలుగువారంతా ఏకం కావాలని తను స్వచ్ఛందంగా పదవి దిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఏర్పడటానికి పదవి త్యాగం చేశారు. ఇంకొకరు అమరజీవి పొట్టి శ్రీరాములు. తెలుగువాడి ఉనికి లేని రోజున మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న రోజుల్లో, తెలుగు వారిని గోల్టీలు అని సంబోధించే సమయంలో తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగు రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి”- పవన్ కల్యాణ్
“వైసీపీ వాళ్లు ఇటీవల బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. వైసీపీ ఒక్కటే చెబుతున్నా.. మీరు అధికారంలో ఉన్నప్పుడే మీ బెదిరింపులకు నేను భయపడలేదు. మీ దౌర్జన్యాలకు మేము భయపడలేదు. ఇప్పటికీ అర్థం చేసుకోకుండా.. మళ్లీ మేము వస్తాం. ఒక్కొక్కడినీ చంపేస్తాం. నరికేస్తాం అంటున్నారు. పిఠాపురం వంటి చోట చిన్న పిల్లల్లో కుల విభేదాలు సృష్టించాలని చూశారు. వైసీపీ దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనం. కులరాజకీయాల్లోకి పిల్లలను తీసుకొస్తున్నారు. కాంట్రాక్ట్ లు చేసిన వాళ్లను బెదిరిస్తూ.. వాళ్లను జైలులో పెడతాం అంటున్నారు. అలాంటి వాళ్లకు ఒకటే చెబుతున్నా.. అధికారం ఉన్నా లేకపోయినా పవన్ కల్యాణ్.. ఎప్పుడూ భయపడడు. మీ ఆకురౌడీలు మమల్ని ఏం చేయలేరు. తిరిగి ఇంటికి వెళ్లను అనే డిసైడ్ అయ్యే ఇంట్లోంచి బయలుదేరుతా” –పవన్ కల్యాణ్
Also Read: CM Chandrababu: పెన్షన్లపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ప్రతి జిల్లాకు 200 కొత్త పింఛన్లు
“అధికారులు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఏమైనా మాట్లాడితే చెవుల్లో చెబుతుంటారు. రౌడీలు, కిరాయి హంతకులు ఉంటారండి అంటుంటారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగా ట్రీట్మెంట్ ఇచ్చి.. రౌడీయిజం అన్న వాళ్లను కాలుకు కాలు తీసి కూర్చోబెడతాం. వేల మంది పోలీసులు, వందల మంది ఐపీఎస్ లు ఉన్న ప్రభుత్వం రెండు రోజులు తలచుకుంటే.. రౌడీ గ్యాంగ్ లను నడిపించే వ్యక్తుల లెక్కలు తీస్తే అంతా ముగుస్తుంది. అప్పటి వరకూ తీసుకెళ్లకండి” అని వైసీపీని ఉద్దేశించి పవన్ హెచ్చరించారు.