Pawan Kalyan: “పుంగనూరు ఏమైనా పాకిస్తాన్లో ఉందా? వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి వ్యాపారం చేసుకోకూడదా? ఇంకా ఆ పాత పెత్తనాలే చెలాయిస్తామంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు..” ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూనకం వచ్చినట్లు విరుచుకుపడ్డారు. పుంగనూరులో మైనింగ్ను అడ్డుకుంటున్న స్థానిక నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై ఆయన తీవ్రంగా స్పందించారు.
బుధవారం సచివాలయంలో మధ్యప్రదేశ్ ఎంపీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో జరుగుతున్న ఆటంకాలను ఆయన పవన్ దృష్టికి తీసుకొచ్చారు.
మధ్యప్రదేశ్కు చెందిన కొందరు వ్యక్తులు సదుంలో గ్రానైట్ మైనింగ్ చేయడానికి ప్రభుత్వ అనుమతులు పొందారు. అయితే, అక్కడి కొందరు స్థానిక నాయకులు “మీరు వేరే రాష్ట్రం వాళ్లు, ఇక్కడ మైనింగ్ ఎలా చేస్తారు?” అంటూ వారిని అడ్డుకుంటున్నారు. పనులు జరగకుండా బెదిరింపులకు దిగుతున్నారని డాక్టర్ కులస్తే ఫిర్యాదు చేశారు.
దీనిపై పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులమేనని గుర్తుచేశారు. అనుమతులు ఉన్నా కూడా ఇలా రౌడీయిజం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అధికార యంత్రాంగం నిబంధనల ప్రకారం మైనింగ్ చేసుకునే వారికి రక్షణ కల్పిస్తుందని, అడ్డంకులు సృష్టించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని భరోసా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు.
పుంగనూరు నియోజకవర్గం గత కొంతకాలంగా రాజకీయంగా ఉద్రిక్తంగా ఉంటోంది. గతంలో అటవీ భూముల ఆక్రమణలు, ఎన్నికల సమయంలో ఘర్షణలు వంటి కారణాలతో పుంగనూరు వార్తల్లో నిలిచింది. తాజా ఘటనలో మైనింగ్ మాఫియా లేదా స్థానిక పెత్తందారుల జోక్యంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
Read Also: ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ బస్ ఎందుకన్నారు?..భోగాపురం క్రెడిట్ పై వైసీపీకి లోకేశ్ పంచ్