Payyavula Keshav: రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టరుకు బిల్లుల చెల్లింపుల వ్యవహరంపై ఆర్థిక మంత్రి పయ్యావుల సీరియస్ అయ్యారు. కాంట్రాక్టరుకు ఎందుకు బిల్లులు చెల్లింపులు చేశారంటూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై పయ్యావుల మండిపడ్డారు. వివరణ ఇవ్వాలని మంత్రి పయ్యావుల ఆదేశించారు. నిర్మాణ పనుల బిల్లులను చెల్లించలేదని అధికారుల వెల్లడించారు. అదే సంస్థ చేపట్టిన వేరే పనులకు బిల్లుల చెల్లింపు జరిగినట్టు వివరించారు. వేరే బిల్లులైనా సరే.. ఆ కాంట్రాక్టరుకు ఎందుకు చెల్లింపులు జరపాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
గతంలో ఓసారి చెప్పినా.. వినకుంటే ఎలా అంటూ మంత్రి పయ్యావుల అసహనం వ్యక్తం చేశారు. అసలు ఆ కాంట్రాక్టరుకు జరిపిన చెల్లింపుల వివరాలు.. ఏయే పనులకు బిల్లులు చెల్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చెల్లింపుల కోసం ఎవరైనా సిఫార్సు చేశారా..? లేక సొంత నిర్ణయమా..? అంటూ అధికారులను మంత్రి ప్రశ్నించారు. ఇకపై ఆ కాంట్రాక్టరు చేపట్టిన ఎలాంటి పనులకైనా సరే.. బిల్లుల చెల్లింపులు చేపట్టవద్దని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. సీఎం లేదా తన దృష్టికి తీసుకురాకుండా బిల్లుల చెల్లింపులు జరిపితే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందంటూ ఆర్థిక మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.