Dorababu: పిఠాపురం రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనం రేపుతున్నాయి. తాజాగా బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వర్మపై నిప్పులు చెరిగారు. అసలు తమ మధ్య గొడవ ఎక్కడ మొదలైందో చెబుతూ.. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని వర్మ చింపడం వల్లే తాను తీవ్రంగా విభేదించాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. కేవలం తన వ్యక్తిగత లాభాల కోసం, రాజకీయ ఉనికి కోసం వర్మ కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని దొరబాబు మండిపడ్డారు.
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు చేరకుండా వర్మ అడ్డుకుంటున్నారని దొరబాబు ఆరోపించారు. వర్మ సాగిస్తున్న భూకబ్జాల వ్యవహారం తన వద్ద ఉందని, త్వరలోనే అన్ని ఆధారాలతో వాటిని బయటపెడతానని హెచ్చరించారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, ప్రతి విషయంలోనూ తాను పూర్తి క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యంగా తాను వైసీపీకి కోవర్ట్గా పని చేస్తున్నాననే ప్రచారాన్ని దొరబాబు కొట్టిపారేశారు. ‘నాకు ఎవరికీ కోవర్ట్గా ఉండాల్సిన అవసరం లేదు’ అని ఆయన కుండబద్దలు కొట్టారు. అవినీతిపై ఎవరికైనా అనుమానాలు ఉంటే, జనసేన పార్టీ అనుమతిస్తే ఒక రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించేందుకు కూడా తాను సిద్ధమని సవాల్ విసిరారు. ఎవరి హయాంలో అవినీతి జరిగిందో, ఎవరు ప్రజల సొమ్మును దోచుకున్నారో ఆ విచారణలో తేలుతుందని దొరబాబు ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి దొరబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి.
Also Read: మీ ఇంట్లో ఎంత మంది సీఎంలు అవుతారు హరీష్ రావు? సామెల్ సూటి ప్రశ్న