MLA Samel: మీడియా హాల్ వేదికగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హరీష్ రావు వ్యవహారశైలి ‘దొంగే.. దొంగ అన్నట్టు’ ఉందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రానికి తామే అసలైన వారసులమని చెప్పుకుంటున్న గులాబీ నేతలు, అసలు రాష్ట్రం ఏర్పడకముందే తమ సంచులు సర్దుకున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాబోయే తీర్పు తమకు వ్యతిరేకంగా ఉంటుందనే భయంతోనే హరీష్ రావు ఢిల్లీ పర్యటనలకు వెళ్తున్నారని సామెల్ ఆరోపించారు. ఈ క్రమంలోనే ‘గుంటనక్క ఢిల్లీకి పోయింది’ అని కవిత అన్న మాటలను ఆయన గుర్తు చేస్తూ ఎద్దేవా చేశారు.
మళ్ళీ అధికారంలోకి వస్తామంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఎమ్మెల్యే కొట్టి పారేశారు. కనీసం అసెంబ్లీకే రాని కేసీఆర్ మళ్ళీ ఎలా అధికారంలోకి వస్తారని ఆయన ప్రశ్నించారు. హరీష్ రావు ఇంట్లో ఇంకెంత మంది ముఖ్యమంత్రులు కావాలని కోరుకుంటున్నారో స్పష్టం చేయాలన్నారు. గత పదేళ్ల పాలనలో తెలంగాణను అస్తవ్యస్తం చేశారని, ఆర్టీసీ కార్మికుల చావులకు కారణమైంది గత ప్రభుత్వమేనని సామెల్ మండిపడ్డారు.
తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని, బీఆర్ఎస్ నాయకులు పగటి కలలు కనడం మానేసి వాస్తవంలోకి రావాలని ఆయన హితవు పలికారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ఇంకా అహంకారంతో మాట్లాడటం సరికాదని ఎమ్మెల్యే మందుల సామెల్ స్పష్టం చేశారు.
Also Read: పిక్చర్ ఇంకా బాకీ ఉంది.. సంబరపడొద్దు.. BRSకు చామల స్ట్రాంగ్ వార్నింగ్